• Telugu News
  • /Telangana

పోలీసులపై విశ్వసనీయత పెరిగింది : రాష్ట్ర పోలీసు హౌసింగ్ ఎండీ, ఐజీ రమేశ్ రెడ్డి

వనపర్తిలో పోలీస్ పెట్రోల్ బంక్ ప్రారంభం, నాణ్యతా ప్రమాణాలు ఖచ్చితంగా అమలు చేస్తున్నామని ఐజీ రమేశ్ రెడ్డి, తెలంగాణ పోలీసులపై విశ్వసనీయత పెరిగింది.

Reported by: Tejaswini Nanna | తెలంగాణ‌ | Sep 08, 2025, 8:03 pm IST
Read Time: 3 mins
పోలీసులపై విశ్వసనీయత పెరిగింది : రాష్ట్ర పోలీసు హౌసింగ్ ఎండీ, ఐజీ రమేశ్ రెడ్డి

విధాత, వనపర్తి ప్రతినిధి : పోలీస్ సంక్షేమ విభాగం నుంచి ఏర్పాటు చేస్తున్న పెట్రోల్ పంపుల్లో నాణ్యత ప్రమాణాలు ఖచ్చితంగా అమలు చేస్తున్నట్లు పోలీస్ ఐజీ రమేశ్ రెడ్డి తెలిపారు. ప్రజలకు పోలీసులపై విశ్వసనీయత పెరిగిందన్నారు. సోమవారం వనపర్తి మండలం రాజపేట గ్రామ శివారులో వనపర్తి పోలీస్ శాఖ సౌజన్యంతో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ ప్రారంభోత్సవానికి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, స్థానిక ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి, జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ తో కలిసి ఐజీ రమేశ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐజీ మాట్లాడారు. ఇండియా జస్టిస్ రిపోర్టులో భారతదేశంలోనే తెలంగాణ పోలీసులు ప్రథమ స్థానంలో ఉండడం చాలా గర్వకారణమన్నారు.

ప్రజలకు అండగా పోలీసు వ్యవస్థ : ఎమ్మెల్యే తూడి మేఘరెడ్డి

పోలీసులు ప్రజలకు అండగా నిలబడి వారి సమస్యలను పరిష్కరిస్తారని ఎమ్మెల్యే తూడి మేఘరెడ్డి తెలిపారు. రాబోవు రోజుల్లో కొత్తకోట, వనపర్తి కారిడార్ ఏర్పాటు కోసం చేసిన ప్రతిపాదనలను ఆర్ అండ్ బీ మంత్రికి ఇచ్చామని తెలిపారు. దీంతో పాటు వనపర్తికి మంజూరు అయిన బైపాస్ రోడ్డు పనులు ప్రారంభిస్తామని తూడి వెల్లడించారు. అనంతరం కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ, జిల్లాలో ఏర్పాటు చేసిన పోలీస్ పెట్రోల్ బంక్ లో క్వాలిటీ, క్వాంటిటీ పారదర్శకంగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐ ఓ సి ఎల్ అధికారులు సుమిత్ర, శరణ్య, డీఎస్పీ వెంకటేశ్వర్లు, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీపీ కిచ్చారెడ్డి, బీ.కృష్ణ, నాయకులు లక్కాకుల సతీష్ కుమార్, బ్రహ్మయ్యచారి, ఎస్‌ఎల్ ఎన్ రమేశ్ శెట్టి, సీఐలు, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.