సీఎం కేసీఆర్ కు ఓటుతో బుద్ది చెప్పండి.. గ‌జ్వేల్‌లో ఈటల రాజేందర్

  • Publish Date - November 4, 2023 / 03:38 PM IST

విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: బూటకపు హామీలతో గద్దెనెక్కిన సీఎం కేసీఆర్ కు ఓటుతో బుద్ది చెప్పి గద్దె దింపాలని బీజేపీ గజ్వేల్ నియోజకవర్గ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. శనివారం మనోహరాబాద్, తూప్రాన్ మండలంలో బీజేపీ ప్రచార రోడ్డు షోలలో భాగంగా కాళ్లకల్ బంగారమ్మ దేవాలయం వద్ద రాష్ట్ర సర్పంచ్ ల ఫోరమ్ ఉపాధ్యక్షులు నత్తి మల్లేష్, ఎంపీటీసీ నత్తి లావణ్య ఆధ్వర్యంలో భారీ గజమాల, డోలు వాయిద్యాలతో ఈటల కు ఘనస్వాగతం పలికారు. బంగారమ్మ దేవాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.


అనంతరం కాళ్లకల్ గ్రామంలో భారీ సంఖ్యలో బైక్ ర్యాలీతో రోడ్డు షో నిర్వహించారు. వారికి ఎంపీటీసీ నత్తి లావణ్య ఆధ్వర్యంలో మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. అనంతరం ఈటల మాట్లాడుతూ ఏనాడూ ప్రజల కోసం పనిచేయలేని ముఖ్యమంత్రి అవసరమా? కేసీఆర్ వేల మంది కుటుంబాలను రోడ్డున పడేసిన దుర్మార్గుడు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ అహంకారం అణచడానికి నేను గజ్వేల్ నుండి పోటీలో ఉంటున్నట్లు తెలిపారు. కేసీఆర్ ను చిత్తుగా ఓడించాలని కోరారు. అక్కడి నుండి మూప్పిరెడ్డిపల్లి మీదుగా రోడ్డుషో కొనసాగించి, జీడిపల్లి వద్ద బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించారు.


అక్కడినుండి రోడ్డు షో గా జీడిపల్లి, మనోహరాబాద్, రామాయిపల్లి మీదుగా తూప్రాన్ మండలం ఘనపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా భారీ సంఖ్యలో మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, ఉద్యమకారులు, కార్యకర్తలు బీజేపీలో చేరిన సందర్బంగా వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రోడ్డు షోలో మేడ్చల్ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు జగన్ గౌడ్, నియోజకవర్గం ఇంచార్జి సాయిబాబా, మనోహరాబాద్, తూప్రాన్ మండల అధ్యక్షులు నరేందర్, మహేష్ గౌడ్, అజయ్, నాగరాజు, భారీ సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Latest News