విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయం ఇప్పుడు పాతరేయబడింది. జనాభా ప్రకారం బీసీలకు సీట్లు కావాలని ఆడిగితే, ఎగ్గొట్టడానికి దొంగ సర్వేలు చేస్తున్నారు. ఈ పరిణామాలను తట్టుకోలేక పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల ఆవేదన వ్యక్తం చేశారు.
ఢిల్లీకి బీసీ టీమ్ వెళితే ఏఐసీసీ నాయకులు కలవకపోవడం అవమానకరం. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెపుతూ పార్టీని అమ్మకానికి పెట్టి ఒక వ్యాపార వస్తువుగా మార్చి వేశారు. బజార్లో గొడ్లను అమ్మినట్టు పార్టీ టికెట్లను అమ్మకుంటున్నారు. ఈ వ్యాపార రాజకీయాలతో పార్టీ పరువు మట్టిలో కలిసిపోతుందని ఆయన అన్నారు.
మల్లికార్జున్ ఖర్గేకు లేఖ
ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేకు మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య శనివారం రాజీనామా లేఖను అత్యంత బాధాతప్త హృదయంతో రాస్తున్నట్లు పేర్కొన్నారు. పొన్నాల లేఖలో పేర్కొన్న అనేక వివరాలు ఇలా ఉన్నాయి. నాలుగు దశాబ్దాలుగా క్రియాశీల కార్యకర్త నుంచి తెలంగాణ రాష్ట్ర తొలి పీసీసీ అధ్యక్షుల వరకు అనేకమైన కీలక పదవులను నిర్వహించాను. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా సుమారు 12 సంవత్సరాల పాటు మంత్రిగా పని చేశాను.
పార్టీలో పరిణామాలు కలిచి వేశాయి
ఇటీవల కాంగ్రెస్ పార్టీలో పరిణామాలు కలిచివేస్తున్నాయి. 2015లో ఓటమికి నేను కారణమని నన్ను బలి చేశారు. నన్ను పీసీసీ అధ్యక్ష పద నుండి అకారణంగా తొలగించి ఏ పదవి ఇవ్వ కున్నా పార్టీలో ఉన్నాను.
బీఆర్ఎస్ లో బీసీలకు ప్రాధాన్యత
ఒకవైపు అధికార బీఆర్ఎస్ పార్టీలో చిన్న చిన్న బీసీ కులాలను కూడా గుర్తించి వారికి ఎంపీ, ఎమ్మెల్సీ, కార్పొరేషన్ పదవులు, పార్టీ పదవులు ఇస్తుంటే.. మన దగ్గర పట్టించుకోవడం లేదు. పార్టీలో అవమానాలు భరిస్తూ మనుగడ సాధించలేమన్న ఆవేదనతో పార్టీతో నాకు ఉన్న అనుబంధాన్ని తెంచుకోవాలని అనుకుంటున్నాను, పార్టీలో నాకు పదవులు ఇచ్చి ఆదరించిన ప్రతిఒక్కరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ పొన్నాల లక్ష్మయ్య రాజీనామా లేఖలో పేర్కొన్నారు.