పాడిపంటల పల్లె సీమలు ధాన్యం కొనుగోలు సమస్యలతో సతమతమవుతున్నాయి. నిత్యం ఎక్కడో ఒక చోట రైతన్నలు తమ ధాన్యం కొనుగోలు సమస్యలపై రోడెక్కి ధాన్యం కొనుగోలు జరుపాలంటూ ఆందోళనకు దిగుతున్నారు
విధాత : పాడిపంటల పల్లె సీమలు ధాన్యం కొనుగోలు సమస్యలతో సతమతమవుతున్నాయి. నిత్యం ఎక్కడో ఒక చోట రైతన్నలు తమ ధాన్యం కొనుగోలు సమస్యలపై రోడెక్కి ధాన్యం కొనుగోలు జరుపాలంటూ ఆందోళనకు దిగుతున్నారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా భూధాన్ పోచంపల్లి మండలం జూలూరు గ్రామంలోని ఐకేపీ కొనుగోలు సెంటర్లో గత వారం రోజులుగా ధాన్యం కొనుగోళ్లు జరపడం లేదంటూ అన్నదాతలు ఆగ్రహంతో ఆందోళనకు దిగారు.
చౌటుప్పల్ నుంచి జూలూర్ రహదారిపై కంప చెట్లు వేసి నిరసన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యంతో అకాల వర్షాలకు తమ ధాన్యం అంతా తడిసి నష్టపోతున్నామని వాపోయారు. ధాన్యం కొనుగోళ్లు జరిపేంత వరకు ధర్నా విరమించేది లేదంటూ రోడ్డుపైనే బైఠాయించి ధర్నా నిర్వహించారు. రైతుల ఆందోళన సమాచారంతో పోలీసులు, అధికారులు వచ్చి రైతులతో సంప్రదింపులు జరిపి ధాన్యం కోనుగోలుపై హామీలిచ్చి వారి ఆందోళన విరమింపచేశారు.