Farmers’ Protest| రైతు భరోసా కోసం సెక్రటేరియట్ ముందు రైతుల ధర్నా..ఉద్రిక్తత

Reported by: Y.V. Narsimha Reddy | Latest News | Jun 23, 2025, 1:27 pm IST
Read Time: 2 mins
Farmers’ Protest| రైతు భరోసా కోసం సెక్రటేరియట్ ముందు రైతుల ధర్నా..ఉద్రిక్తత

విధాత, హైదరాబాద్ : మహబూబ్ నగర్ జిల్లా నారాయణపురం రైతులు సోమవారం సెక్రటేరియట్ ముందు ధర్నాకు దిగారు. సెక్రటేరియట్ ముట్టడికి వచ్చిన రైతులు సౌత్ ఈస్ట్ గేటు ముందు ధర్నాకు దిగారు. కేసముద్రం మండలం నారాయణపురంతో పాటు 14తండాల గిరిజన రైతులు వందలాది మంది సెక్రటేరియట్ ముందు ఆందోళనకు దిగారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే తమ సమస్యను పరిష్కరించి..తమకు రావాల్సిన రైతు భరోసా..రైతు రుణమాఫీ, రైతు బీమా పథకాలు అందించాలని బాధిత రైతులు డిమాండ్ చేశారు. పోలీసులు వారిని అక్కడి నుంచి బలవంతంగా పంపించివేశారు.

గిరిజన రైతులకు చెందిన 1827.12 ఎకరాల సాగు భూమికి పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వాలని గత ఎనిమిదేళ్లుగా కొట్లాడుతూనే ఉన్నారు. ఎన్నో ఏళ్ల నుంచి సాగు చేసుకుంటున్న భూములను గత ప్రభుత్వం ధరణిలో అటవీ భూములుగా నమోదు చేసింది. పట్టా పాస్ పుస్తకాలు లేకపోవడంతో రైతు భరోసా, రైతు భీమా, రుణమాఫీ వంటి అనేక పథకాలు వారికి రావడం లేదు. తమ భూ హక్కుల సమస్యలను లైనంత త్వరగా పరిష్కరించి రైతు సంక్షేమ పథకాలు వర్తింప చేయాలని వారు కోరారు.