నార్కట్పల్లి అద్దంకి హైవేపే ట్రాఫిక్ జామ్
పోలీసులతో వాగ్వివాదం..తోపులాట
Nalgonda | నల్లగొండ జిల్లా మాడుగులపల్లి మండల కేంద్రంలో ఏఎమ్మార్పీ (AMRP) లోలెవల్ వరద కాలువ రైతులు సాగునీటి కోసం ధర్నాకు దిగారు. నార్కెట్ పల్లి-అద్దంకి హైవేపై బైఠాయించి ధర్నాకు దిగిన రైతుల ఆందోళనతో ఈ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. రైతులు, పోలీసులకు మధ్య వాగ్వివాదం, తోపులాట సాగింది. కాలువలో పిచ్చి మొక్కలు, తాటి చెట్లు పెరగడంతో దిగువకు కాలువ నీరు రావడం లేదని, . రైతుల సమస్యలను ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవడం లేదని, బోరు బావుల కింద సాగు చేసిన వరి పంట పొలాలు ఎండిపోతున్నాయని రైతుల ఆందోళన వ్యక్తం చేశారు.
ఇటీవల నాగార్జున సాగర్ (Nagarjuna Sagar)కు భారీగా వరద నీరు వచ్చినప్పటికి ఏఎమ్మార్పీ కాలువలకు, డిస్ట్రీబ్యూటరీలకు నీటి విడుదల ఆలస్యం చేశారు. నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి కలెక్టర్కు వినతి పత్రం సమర్పించి నీటి విడుదల చేపట్టాలని, లేని పక్షంలో ఆయకట్టు రైతులతో కలిసి ఆందోళన చేస్తామని ప్రకటించారు. ఆ వెంటనే ప్రభుత్వం స్పందించి నీటి విడుదల చేపట్టింది. అయితే కాలువల నిర్వాహణ లోపాలతో కాలువల్లో నీరు పారకపోవడంతో దిగువ ప్రాంతాల రైతులు ఆందోళనకు దిగారు. రైతుల ఆందోళన సమాచారం తెలుసుకున్న కలెక్టర్ సి.నారాయణరెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిలు సమస్యను త్వరగా పరిష్కరిస్తామని హామీనిచ్చారు.