Site icon vidhaatha

KALESHWARAM | కాళేశ్వరం రిజర్వాయర్లు నింపండి..ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్‌కు హరీశ్‌రావు లేఖ

విధాత, హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని రిజర్వాయర్లు నింపి రైతులకు సాగునీరు వసతి కల్పించాలని మాజీ మంత్రి టి.హరీశ్‌రావు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి లేఖ రాశారు. సిద్దిపేట జిల్లాలోని అన్నపూర్ణ (అనంతగిరి) రిజర్వాయర్, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్ లు పూర్తిగా నీళ్లు లేక రిజర్వాయర్లు అడుగంటి పోయే పరిస్థితికి చేరుకున్నాయని హరీశ్‌రావు లేఖలో పేర్కోన్నారు. గత సంవత్సరం ఇదే ఆగస్టు నెలలో అనంతగిరి రిజర్వాయర్‌లో 3.32 టీఎంసీల నీళ్ళు ఉంటే ప్రస్తుతం 0.75 టీఎంసీలు, రంగనాయక సాగర్ లో 2.38 టీఎంసీలకు గాను ప్రస్తుతం 0.67 టీఎంసీలు, మల్లన్న సాగర్ 18 టీఎంసీలకు గాను ప్రస్తుతం 8.5 టీఎంసీలు, కొండ పోచమ్మ సాగర్ 10 టీఎంసీలకు గాను ప్రస్తుతం 4.5 టీఎంసీలు మాత్రమే ఉన్నాయని వివరించారు. ఒకవైపు రిజర్వాయర్లలో నీళ్లు లేక, మరోవైపు వర్షాలు కురవక రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పంటలు వేయాలా వద్దా అని అయోమయంతో రైతులు ఆవేదన చెందుతున్నారని, గత సంవత్సరం ఇదే సమయంలో పోలిస్తే జిల్లాల పంటల సాగు విస్తీర్ణం కూడ తగ్గి పోయిందని గుర్తు చేశారు. రాజకీయాలు పక్కనబెట్టి మిడ్ మానేరు నుంచి అన్నపూర్ణ రిజర్వాయర్, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్లకు నీటిని పంపింగ్ చేసేలా ఇరిగేషన్ అధికారులకు వెంటనే ఆదేశాలు జారీ చేయాలని హరీశ్‌రావు తన లేఖలో మంత్రి ఉత్తమ్‌ను కోరారు. అదేవిధంగా కాలువల ద్వారా నీటిని విడుదల చేసి ఆయకట్టుకు నీళ్లందించెలా చర్యలు తీసుకోవాలని జిల్లా రైతాంగం పక్షాన కోరుతున్నానని లేఖలో పేర్కోన్నారు.

 

Exit mobile version