స్వేచ్ఛ మన జీవన శైలి బానిసత్వాన్ని తెలంగాణ సహించదు ప్రేమను పంచుతాం.. పెత్తనాన్ని ప్రశ్నిస్తాంరాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు

స్వేచ్ఛ తెలంగాణ జీవన శైలిలో భాగమని, బానిసత్వాన్ని తెలంగాణ భరించదని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి చెప్పారు. ప్రేమను పంచడం, పెత్తనాన్ని ప్రశ్నించడం మన తత్వమన్నారు. ఆకలినైనా భరిస్తాం కానీ, స్వేచ్ఛను హరిస్తే సహించబోమని పేర్కొన్నారు

  • Publish Date - June 2, 2024 / 08:19 PM IST

స్వేచ్ఛ మన జీవన శైలి
బానిసత్వాన్ని తెలంగాణ సహించదు
ప్రేమను పంచుతాం.. పెత్తనాన్ని ప్రశ్నిస్తాం
గత పదేళ్లలో వందేళ్ల విధ్వంసం
దానిని పునర్నిర్మించాల్సిన బాధ్యత ఉంది
ప్రతిపక్షానికి గౌరవం ఇస్తున్నాం
లోటుపాట్లను సమీక్షించుకుంటున్నాం
మేమే సర్వజ్ఞులం అనే భావనలో లేము
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు
హైదరాబాద్‌: స్వేచ్ఛ తెలంగాణ జీవన శైలిలో భాగమని, బానిసత్వాన్ని తెలంగాణ భరించదని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి చెప్పారు. ప్రేమను పంచడం, పెత్తనాన్ని ప్రశ్నించడం మన తత్వమన్నారు. ఆకలినైనా భరిస్తాం కానీ, స్వేచ్ఛను హరిస్తే సహించబోమని పేర్కొన్నారు. దాశరథి చెప్పినట్టు తెలంగాణ అమాయకపు నెరజాణే కానీ… అన్యాయం జరిగితే తిరగబడే నైజం కూడా మనకు ఉంది. సంక్షేమం ముసుగులో ప్రజాస్వామ్యాన్ని చెరబట్టాలని చూస్తే తెలంగాణ భరించదు’ అని స్పష్టం చేశారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం పరేడ్‌గ్రౌండ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. ‘ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే పొలిమేరల వరకు తరిమికొడతాం… ప్రాంతం వాడే ద్రోహం చేస్తే ప్రాణాలతోనే పాతిపెడతాం’ అన్న కవి కాళోజీ మాటలను ఆయన గుర్తు చేశారు. ఇది నాలుగు కోట్ల ప్రజల హృదయాలు ఆనందంతో ఉప్పొంగే పర్వదినమని సీఎం పేర్కొన్నారు. తెలంగాణ అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి పట్టాభిషేకం జరిగి దశాబ్ద కాలం పూర్తయిందన్న రేవంత్‌రెడ్డి.. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరులకు నివాళి అర్పించారు. ఆరు దశాబ్దాల మన కలను నిజం చేసిన నాటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్, నాటి యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీలకు తెలంగాణ సమాజం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

స్వేచ్ఛ పునరుద్ధరణకు తొలి ప్రాధాన్యం

డిసెంబర్ 7, 2023న ప్రారంభమైన ప్రజా పాలనలో స్వేచ్ఛ పునరుద్ధరణకు మొదటి ప్రాధాన్యాం ఇచ్చామని, ముళ్ల కంచెలు, ఇనుప గోడలు తొలగించి, పాలకులు, పాలితుల మధ్య గోడలు బద్దలు కొట్టామని ముఖ్యమంత్రి చెప్పారు. మున్సిపల్ కౌన్సిలర్ నుండి… ముఖ్యమంత్రి వరకు ప్రజలకు అందుబాటులో ఉండే పాలన తెచ్చామన్నారు. తాము సేవకులం తప్ప పాలకులం కాదన్న నిజాన్ని నిరూపించామని చెప్పారు. సచివాలయంలోకి సామాన్యుడు కూడా రాగలిగే పరిస్థితి తెచ్చామని, ఇందిరాపార్కులో ధర్నాచౌక్ కు అనుమతి ఇచ్చామని, మీడియాకు స్వేచ్ఛను కల్పించామని, ప్రతిపక్షానికి గౌరవం ఇచ్చామని తెలిపారు. తమ నిర్ణయాల్లో లోటుపాట్ల సమీక్షకు అవకాశం ఇస్తున్నామన్న ముఖ్యమంత్రి.. తప్పులు జరిగితే సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. తామే సర్వ జ్ఞానులం అన్న భ్రమలు లేవని, అందరి సలహాలను, సూచనలను స్వీకరించి, చర్చించి ముందుకు వెళుతున్నామని చెప్పారు.
జూన్ 2, 2014 నాడు తెలంగాణ భౌగోళిక ఆకాంక్ష నెరవేరినా.. ఈ దశాబ్ద కాలంలో వందేళ్ల విధ్వంసానికి గురైందని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ పదేళ్లలో తెలంగాణ మూల స్వభావమైన స్వేచ్ఛ పై దాడి జరిగిందని, సామాజిక న్యాయం మేడిపండు చందంగా మారిందని విమర్శించారు. ప్రజలందరికీ చెందాల్సిన రాష్ట్ర సంపద గుప్పెడు మంది చేతుల్లోకి చేరిందని, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు విధ్వంసానికి గురయ్యాయని చెప్పారు. ఆర్థిక విధ్వంసం సంగతి చెప్పనక్కర్లేదన్నారు. అయితే ఇదంతా గతమని, ఇప్పుడు ప్రజలే, ప్రజల కోసం, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణలో ఉందని ప్రకటించారు. ప్రజా ప్రభుత్వంలో జరుపుకుంటున్న మొదటి ఆవిర్భావ దినోత్సవానికి చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంటుందని తెలిపారు. దశాబ్ది ఉత్సవాల శుభ సందర్భంలో… అమరుల ఆశయాలు, ప్రజల కలలు నెరవేర్చే దిశగా ప్రజా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఆయన వివరించారు. ‘ఏ జాతికైనా తన సంస్కృతే తన అస్తిత్వం. ఆ సంస్కృతిని కాపాడటం ప్రభుత్వాల బాధ్యత. బోనం నుండి బతుకమ్మ వరకు… సాయుధ పోరాటం నుండి స్వరాష్ట్ర ఉద్యమం వరకు మన సంస్కృతి, మన చరిత్ర గొప్పవి. సమ్మక్క సారలమ్మ నుండి జోగులాంబ వరకు… భద్రాద్రి రాముడు నుండి కొమురం భీం వరకు, అమరుల త్యాగాలు, హక్కుల ఉద్యమాల వంటి వాటితో తెలంగాణ గొప్ప చారిత్రక వారసత్వాన్ని కలిగి ఉంది. ఈ సంస్కృతికి, చరిత్రకు పునరుజ్జీవనం జరగాలి’ అని రేవంత్‌రెడ్డి చెప్పారు.సాంస్కృతిక

సాంస్కృతిక పునరుజ్జీవానికి నిదర్శనం జయజయహే తెలంగాణ గీతం

‘తెలంగాణ వచ్చి పదేండ్లైన ఇప్పటికీ మనకు రాష్ట్ర గీతం లేదు. ఉద్యమ కాలంలో ఉవ్వెత్తున స్ఫూర్తిని రగిలించిన… సహజ కవి అందెశ్రీ రచించిన ‘జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం..’ గేయమే మన రాష్ట్ర అధికార గీతం కావాలని ఆ నాడు ఆశించాం. ప్రజల ఆకాంక్షల మేరకు ఈ పర్వదినాన ‘జయ జయహే తెలంగాణ…’ గీతాన్ని రాష్ట్ర అధికారిక గీతంగా సగర్వంగా ప్రకటిస్తున్నాం. ఇది సాంస్కృతిక పునరుజ్జీవనానికి తొలి అడుగు’ అని సీఎం తెలిపారు.

ధిక్కారం, పోరాటం ప్రతిఫలించేలా చిహ్నం
తెలంగాణ అంటే ధిక్కారం, పోరాటమన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. రాష్ట్ర అధికారిక చిహ్నంలో అది ప్రతిబింబించాలని, ఆ దిశగా ప్రజా ప్రభుత్వం నూతన చిహ్నాన్ని రూపొందించే పనిలో ఉందని తెలిపారు. ప్రభుత్వ అధికారిక ఉత్తర్వులు, సంస్థల సంక్షిప్త పేర్లు, వాహన రిజిస్ట్రేషన్ లో రాష్ట్రాన్ని సూచించే సంక్షిప్త అక్షరాలుగా టీజీ ఉండాలని ప్రజా ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. తెలంగాణ తల్లి నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షల ప్రతిరూపంగా ఉండాలని సీఎం అన్నారు. కష్టజీవి… కరుణామూర్తి రూపురేఖలతో తెలంగాణ తల్లి రూపానికి పునరుజ్జీవనం జరగాలని, త్వరలోనే తెలంగాణ తల్లి రూపం సిద్ధం అవుతుందని తెలిపారు. ఈ నిర్ణయాలు ఒక జాతి ఆకాంక్షలకు ప్రతిరూపం మాత్రమేనని స్పష్టం చేశారు.
విధ్వంసమైన ఆర్థిక వ్యవస్థ
తాము అధికారం చేపట్టేనాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా విధ్వంసమై, 7 లక్షల కోట్ల రూపాయల అప్పుల ఊబిలో తెలంగాణ ఉందని రేవంత్‌రెడ్డి తెలిపారు. ఆర్థిక క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇస్తూనే సంక్షేమం, అభివృద్ధిలో రాజీ పడటం లేదని, ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మొదటి తారీఖునే వేతనాలు ఇస్తున్నామని చెప్పారు. దీర్ఘ కాలిక ప్రణాళికలతో భవిష్యత్తుకు పునాదులు వేస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. ‘మొత్తం తెలంగాణకు ‘గ్రీన్ తెలంగాణ 2050 మాస్టర్ ప్లాన్’ తయారు చేస్తున్నాం. రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజిస్తున్నాం. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్న ప్రాంతం అర్బన్ తెలంగాణ, ఔటర్ రింగ్ రోడ్డు నుండి రీజినల్ రింగ్ రోడ్డు మధ్య ప్రాంతం సబ్ అర్బన్ తెలంగాణ, రీజినల్ రింగ్ రోడ్డు నుండి తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల వరకు ఉన్నది గ్రామీణ తెలంగాణగా నిర్ధారించాం. మూడు జోన్లలో ఎక్కడ ఎలాంటి అభివృద్ధి జరగాలి… ఎక్కడ ఏ రకమైన మౌలిక సదుపాయాల కల్పన జరగాలన్నది ఈ మెగా ప్రణాళికలో విస్పష్టంగా ప్రకటిస్తాం’ అని రేవంత్‌రెడ్డి వివరించారు. మూసీ సుందరీకరణ పథకం ద్వారా పరివాహక ప్రాంతాన్ని ఉపాధి కల్పన జోన్‌గా తీర్చిదిద్దబోతున్నామని ప్రకటించారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను ఈ పథకం మరోస్థాయికి తీసుకువెళ్లుతుందనడంలో సందేహం లేదన్నారు. తెలంగాణలో డ్రగ్స్ అన్న మాట వినిపించడానికి వీలు లేదని మేం సంకల్పం తీసుకున్నామని చెప్పారు. పాలన ప్రజల వద్దకు చేర్చాలన్నది ప్రభుత్వ ఆలోచన అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే రెండు గ్యారెంటీల అమలుకు శ్రీకారం చుట్టామని వివరించారు.

సవాళ్లు ఉన్నాయి
తెలంగాణ ముందు పలు సవాళ్లు కూడా ఉన్నాయని, కృష్ణా, గోదావరి జలాల్లో మన వాటా లెక్క తేల్చాల్సిన అవసరం ఉందని రేవంత్‌రెడ్డి చెప్పారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధానికి ఈ రోజుతో కాలం చెల్లింది. ఆంధ్రప్రదేశ్ తో ఆస్తుల విభజనకు సంబంధించి సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించుకుంటామని వివరించారు.

ప్రపంచానికి తెలంగాణ ఒక దిక్సూచి కావాలి

‘తెలంగాణ ప్రపంచానికి ఒక దిక్సూచి కావాలి. తెలంగాణ విజయ పతాక దేశ విదేశాలలో సగర్వంగా ఎగరాలి. “పల్లె కన్నీరు పెడుతోందో…” అని ఒకనాడు ఆవేదనతో పాడిన తెలంగాణ పల్లెలు ఇకపై పచ్చని పైరులతో, పాడి పంటలతో, రైతుల మొఖాలలో చిరునవ్వులతో వెలగాలి. ఒకనాడు పొట్ట చేత పట్టి పట్నంకు వచ్చిన యువత… రేపటి నాడు ప్రపంచానికి మన సత్తా చాటే శక్తిగా మారాలి. తెలంగాణ ఇతర రాష్ట్రాలతో కాదు ప్రపంచంతో పోటీ పడుతుందని నిరూపించాలి’ అని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ‘మనకు శక్తి ఉంది, సత్తువుంది… తెలివి ఉంది, తెగింపు ఉంది, త్యాగాల చరిత్ర ఉంది. ఏం తక్కువ తెలంగాణకు’ అని ప్రశ్నించారు. ‘హైదరాబాద్ మన బ్రాండ్. ప్రపంచ నెంబర్ వన్ బ్రాండ్ గా హైదరాబాద్ ఎదగాలి. తెలంగాణను ప్రపంచానికి డెస్టినేషన్ గా మార్చాలన్న తపన ఉంది. దీనికి నాలుగు కోట్ల ప్రజల ఆశీస్సులతో పాటు… రాజకీయ, పరిపాలన, పత్రికా, న్యాయ, సామాజిక వ్యవస్థల సహకరం కావాలి. ఆ దిశగా ప్రతి ఒక్కరు, ప్రతి క్షణం ఆలోచన చేయాలని… ప్రజా ప్రభుత్వానికి మీ సంపూర్ణ సహకారం అందించాలని కోరుకుంటూ ప్రసంగాన్ని ముగించారు.

Latest News