విధాత: ఏపీ విజయ డెయిరీ బ్రాండ్ పేరుతో తెలంగాణలో జరుగుతున్న కల్తీ పాలు, నెయ్యి వివాదంపై తెలంగాణ రాష్ట్ర డెయిరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డికి, ఏపీ మంత్రి నారా లోకేష్ లకు మధ్య ఎక్స్ వేదికగా సాగిన ట్వీట్ వార్ హాట్ టాపిక్ గా మారింది.
ఏపీ విజయ బ్రాండ్ పేరుతో కల్తీ నెయ్యి విక్రయాలపై అమిత్ ట్వీట్
ముందుగా గుత్తా అమిత్ రెడ్డి ఏపీడెయిరీ ఫెడరేషన్ (APDDCF), విజయ డెయిరీ బ్రాండ్ పేరుతో నిబంధనలకు విరుద్దంగా గుజరాత్లోని కన్హాన్ డెయిరీ నుండి నెయ్యిని సేకరించి ప్యాక్ చేసే మేఘన ఫుడ్స్కు ఫ్రాంచైజ్ చేసి తెలంగాణలో విక్రయిస్తుందని గుర్తు చేస్తూ నారా లోకేష్ ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. తన ట్వీట్ లో మేఘానా ఫుడ్స్ విక్రయిస్తున్న నెయ్యిలో కూరగాయల కొవ్వు గుర్తులు(β-సిటోస్టెరాల్, అధిక లినోలెయిక్ ఆమ్లం) జాడలు కనిపించాయని, ఈ విషయం CALF, NDDB పరీక్షించిన నమూనాలలో నిర్థారణ అయ్యిందని, ఇది FSSAI ప్రమాణాలకు అనుగుణంగా లేకపోవడంతో పాటు కల్తీని సూచిస్తుందని అమిత్ రెడ్డి వెల్లడించారు. కల్తీ నెయి్య విక్రయంతో వినియోగదారుల ఆరోగ్యం ప్రమాదంలో పడిపోవడంతో పాటు విజయ డెయిరీ బ్రాండ్ దెబ్బతిని తెలంగాణ విజయ డెయిరీపై కూడా దాని ప్రభావం పడవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.
నిజానికి మేఘనా ఫ్రాంచైజీకి తెలుగు రాష్ట్రాల్లోని పాడి రైతులు లేదా పాల సహకార సంస్థలతో ఎటువంటి సంబంధం లేదు అని, స్థానిక పాల సేకరణ లేదా ప్రాసెసింగ్ మౌలిక సదుపాయాలు లేవు అని అమిత్ రెడ్డి గుర్తు చేశారు. అయినప్పటికీ విజయ డెయిరీ బ్రాండ్ కింద హైదరాబాద్లో నెలకు 100 టన్నులకు పైగా నెయ్యిని ఆ ఫ్రాంచైజీ విక్రయిస్తుందని, దీనిని ప్రీమియం AP డెయిరీ ఉత్పత్తిగా పేర్కొనడం… విజయ బ్రాండ్ విశ్వసనీయతపై వినియోగదారుల్లో సందేహాలు రేకెత్తించేదిగా ఉందని అమిత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. పాడి రైతులు, పాల సహకార సంస్థలకు చెందిన తెలంగాణ విజయ డెయిరీకి నష్టం చేకూర్చేదిగా తయారైందని తెలిపారు.
వెంటనే దీనిపై స్పందించి APDDCF ఫ్రాంచైజ్ సంస్థను రద్దు చేసి, MACS చట్టం కింద నమోదు చేయబడిన జిల్లా యూనియన్.. వారి జిల్లా అధికార పరిధికి మించి విజయ బ్రాండ్ను అనధికారికంగా ఉపయోగించకుండా నిరోధించాలని అమిత్ రెడ్డి మంత్రి నారా లోకేష్ ను కోరారు. వినియోగదారుల ఆరోగ్యాన్ని కాపాడటానికి, విజయ బ్రాండ్ విశ్వసనీయతను కాపాడటానికి ఈ సమస్యపై చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు.
గుత్తా అమిత్రెడ్డికి మంత్రి లోకేష్ సమాధానం
ఏపీ విజయ డెయిరీ బ్రాండ్ పేరుతో ఇతర సంస్థలు పాలు, నెయ్యి విక్రయించడాన్ని తప్పుబడుతూ దీనిపై చర్యలు తీసుకోవాలంటూ అమిత్ రెడ్డి చేసిన ట్వీట్ పై మంత్రి నారా లోకేష్ కూడా ట్వీట్ ద్వారా స్పందించారు. ఈ అంశంలో తెలంగాణ లేవనెత్తిన అంశాలను, ఆందోళనలపై సమీక్ష చేస్తున్నామని, కల్తీ నెయ్యి విక్రయాలపై APDDCF నాణ్యత పరీక్షలను నిర్వహిస్తోందని తెలిపారు. అలాగే CALF-NDDB పరీక్ష నివేదికలను కూడా పరిశీలిస్తాం అని పేర్కొన్నారు. అయితే ‘వన్ నేషన్-వన్ మార్కెట్’ అనేది ప్రధాని మోదీ నినాదం అని, ఏ రాష్ట్రం పాడి ఉత్పత్తులైన దేశంలోని ఏ ఇతర రాష్ట్రాల్లోనైనా విక్రయించవచ్చు అని గుర్తు చేశారు. నాణ్యత, వినియోగదారుల ఆరోగ్యం ఏపీ ప్రభుత్వానికి ప్రాధాన్యతాంశాలు అని నారా లోకేష్ స్పష్టం చేశారు.
Dear @GuthaAmithReddy garu,
Your concerns are noted and reviewed. APDDCF conducts periodic quality testing and has initiated random market sampling. It has also been directed to obtain the CALF–NDDB test reports from TGDDCF for verification and further necessary action. Marketing… https://t.co/DIJHkMIzft— Lokesh Nara (@naralokesh) March 11, 2026
ఇవి కూడా చదవండి :
IPL 2026 ఇప్పట్లో లేనట్లేనా..?
Telangana Engineering Collegesతెలంగాణ ఇంజనీరింగ్ కాలేజీలకు షాక్..అదనపు వసూళ్లకు చెక్
