Heat Wave | దేశ వ్యాప్తంగా ఎండలు మరింత ముదురుతున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో 50 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లోని తెలంగాణలో కూడా ఎండలు దంచికొడుతున్నాయి. 45 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు నమోదై ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అయితే మరో ఏడు రోజులు భారీ స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మండుటెండలతో పాటు వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
రేపట్నుంచి పలు జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా
రేపట్నుంచి మే 24వ తేదీ వరకు పలు జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో సోమవారం 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. ఆదివారం కూడా ఇదే పరిస్థితి కొనసాగింది.
అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో
ఆదివారం అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలోని భీంగల్ మండలంలో 45.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. అదే జిల్లాలోని మోస్రా మండలంలో 45.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 16 జిల్లాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఇక రాజధాని హైదరాబాద్ నగరంలోని గోషామహల్ సర్కిల్లో అత్యధికంగా 42.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
ఆదిలాబాద్, కుమురం భీం ఆసిపాబాద్, జగిత్యాల, మంచిర్యాల జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. 16 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
