Hyderabad–Warangal Namo Bharat RRTS: One-Hour Travel to Boost Telangana Growth
విధాత తెలంగాణ డెస్క్ | హైదరాబాద్:
HYD-WGL RRTS | తెలంగాణలో రవాణా రంగానికి మరో చారిత్రక ముందడుగు పడబోతోంది. హైదరాబాద్–వరంగల్ మధ్య ‘నమో భారత్’ రీజినల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (RRTS) కారిడార్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇవ్వడం రాష్ట్రాభివృద్ధికి కీలక మైలురాయిగా మారింది. ప్రస్తుతం రెండు నగరాల మధ్య మూడు గంటలకు పైగా పడుతున్న ప్రయాణ సమయాన్ని కేవలం గంటలోనే పూర్తి చేసేలా ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకోనుంది. కేంద్ర ఆర్థిక సర్వేలో ఈ కారిడార్ను దేశవ్యాప్తంగా గుర్తించిన 2,900 కిలోమీటర్ల RRTS నెట్వర్క్లో భాగంగా చేర్చడం విశేషంగా మారింది. దీని ద్వారా తెలంగాణలో ఆర్థిక వృద్ధి, ఉద్యోగావకాశాలు, పారిశ్రామిక విస్తరణకు కొత్త దిశ లభించనుంది.
RRTS – రీజినల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ అంటే ఏంటి?
RRTS (రీజినల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్) అనేది పెద్ద నగరాలను వాటి చుట్టుపక్కల ఉన్న పట్టణాలు, జిల్లా కేంద్రాలతో వేగంగా అనుసంధానించే ఆధునిక రైలు వ్యవస్థ. ఇది ప్రత్యేకంగా నిర్మించిన ట్రాక్పై, గంటకు సుమారు 160 నుంచి 180 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. మెట్రో కంటే ఎక్కువ దూరం, సాధారణ రైలుకంటే ఎక్కువ వేగంతో ప్రయాణ సౌకర్యం కల్పించడమే దీని లక్ష్యం. రోజూ ఉద్యోగాలు, వ్యాపారం కోసం అప్డౌన్ చేసే ప్రయాణికులకు సమయం ఆదా చేసేలా ఈ వ్యవస్థను రూపొందించారు. ప్రాంతీయ అభివృద్ధి, ఉద్యోగావకాశాల పెంపు, ట్రాఫిక్ తగ్గింపులో RRTS కీలక పాత్ర పోషిస్తుంది.
హైదరాబాద్–వరంగల్ కారిడార్ ఎందుకు కీలకం?
హైదరాబాద్ దేశంలోని ప్రధాన ఐటీ, ఫార్మా, ఆటోమొబైల్, రక్షణ తయారీ కేంద్రంగా ఎదిగింది. అదే సమయంలో వరంగల్, నిజామాబాద్, ఖమ్మం వంటి ద్వితీయ స్థాయి నగరాలు అభివృద్ధి కేంద్రాలుగా మారేందుకు అపార అవకాశాలు కలిగి ఉన్నాయి. అయితే రవాణా సౌకర్యాల లోపం కారణంగా ఈ ప్రాంతాల అభివృద్ధి కొంత మందగించింది.
హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరం వరంగల్, గ్రేటర్ కార్పొరేషన్ కూడా. చారిత్రక, పర్యాటక ప్రాంతాలకు పుట్టినిల్లు. ఇప్పుడు పారిశ్రామికంగా కూడా ఎంతో ఎదిగింది. మెగా టెక్స్టైల్ పార్క్, ఐటీ సంస్థలు, వ్యవసాయమే కాకుండా, ఎన్ఐటీ, కాకతీయ విశ్వవిద్యాలయం, ప్రసిద్ధ కాకతీయ వైద్య కళాశాల లాంటి విద్యాసంస్థలకు కూడా పేరెన్నికగన్న నగరం. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి వరంగల్కు రోడ్డు మార్గంలో ప్రయాణించాలంటే సగటున రెండున్నర నుంచి మూడు గంటల సమయం పడుతోంది. రైల్వే మార్గంలో కూడా రెండు గంటలకు పైగా సమయం తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో RRTS అమలులోకి వస్తే, ప్రయాణ సమయం కేవలం ఒక గంటకు తగ్గనుంది.
దీని వల్ల రోజూ ఉద్యోగాలు, వ్యాపారాల కోసం హైదరాబాద్కు వచ్చే వేలాది మంది ప్రయాణికులకు భారీ ఉపశమనం లభించనుంది. అంతేకాదు, వరంగల్ ట్రై-సిటీ (వరంగల్–హనుమకొండ–కాజీపేట) ప్రాంతంలో నివాస, వాణిజ్య, పారిశ్రామిక అభివృద్ధికి బలమైన ఊతం లభించనుంది.
‘నమో భారత్’ RRTSతో తెలంగాణకు లాభాలు
‘నమో భారత్’ ఆర్ఆర్టీఎస్ ప్రాజెక్ట్ సంప్రదాయ రైల్వే, మెట్రో వ్యవస్థలకంటే భిన్నంగా పనిచేస్తుంది. ఇది ప్రత్యేక డెడికేటెడ్ ట్రాక్పై గంటకు సుమారు 180 కిలోమీటర్ల వేగంతో నడిచే సెమీ హైస్పీడ్ రైలు వ్యవస్థ.
ఈ ప్రాజెక్ట్ వల్ల:
- ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది
- రోడ్డు ట్రాఫిక్, ప్రమాదాలు తగ్గుతాయి
- కాలుష్యం నియంత్రణకు తోడ్పడుతుంది
- ఉపనగరాలు, జిల్లా కేంద్రాలు అభివృద్ధి చెందుతాయి
- కొత్త పరిశ్రమలు, ఐటీ పార్కులు ఏర్పడతాయి
- రియల్ ఎస్టేట్ రంగానికి ఊపందుకుంటుంది.
కేంద్ర ఆర్థిక సర్వే ప్రకారం, ఢిల్లీ–మీరట్ RRTS వల్ల దాదాపు 7 లక్షల ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. అదే తరహాలో హైదరాబాద్–వరంగల్ కారిడార్ ద్వారా కూడా లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి.
ప్రాజెక్ట్ సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయడానికి ఇప్పటికే HUMTA(Unified Metropolitan Transport Authority), HMDA ఆధ్వర్యంలో ముందస్తు సాధ్యతా అధ్యయనం(ప్రీ-ఫీజిబిలిటీ స్టడీ) ప్రారంభమైంది. అన్ని అనుమతులు పూర్తయిన తర్వాత నిధుల కేటాయింపు, నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి.
హైదరాబాద్–వరంగల్ మధ్య ‘నమో భారత్’ ఆర్ఆర్టీఎస్ కారిడార్ తెలంగాణ భవిష్యత్ ఆర్థిక రూపురేఖలను మార్చే శక్తి కలిగిన ప్రాజెక్ట్గా మారనుంది. వేగవంతమైన రవాణా, విస్తృత ఉద్యోగావకాశాలు, పారిశ్రామిక విస్తరణతో ఈ మార్గం రాష్ట్ర అభివృద్ధికి కీలక కేంద్రంగా మారడం ఖాయం. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే తెలంగాణలో ప్రాంతీయ సమతుల్య వృద్ధికి కొత్త అధ్యాయం మొదలవనుంది.
