Hydra| బంజారాహిల్స్ లో రూ. 750 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా

బంజారాహిల్స్ లో ఆక్రమణకు గురైన రూ.750కోట్ల విలువైన 5ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా స్వాధీనం చేసుకుంది. షేక్ పేట మండలం బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 10లోని 5ఎకరాలలో ఆక్రమణలను తొలగించింది. స్వాధీనం చేసుకున్న చుట్టు ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ బోర్డులను ఏర్పాటు చేసింది.

విధాత, హైదరాబాద్ : బంజారాహిల్స్ లో(Banjara Hills) ఆక్రమణకు(Land Encroachment) గురైన రూ.750కోట్ల విలువైన 5ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా (Hydra)స్వాధీనం చేసుకుంది. షేక్ పేట మండలం బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 10లోని 5ఎకరాలలో ఆక్రమణలను తొలగించింది. స్వాధీనం చేసుకున్న చుట్టు ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ బోర్డులను ఏర్పాటు చేసింది.

వివరాల్లోకి వెళితే..బంజారాహిల్స్ లోని 5 ఎకరాలలో గతంలో జలమండలికి 1.20 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. అయితే 1.20 ఎకరాలతో పాటు మొత్తం 5 ఎకరాల భూమి తనదంటూ పార్థసారథి అనే వ్యక్తి కోర్టుకెక్కారు. చుట్టూ ఫెన్సింగ్ వేసి బౌన్సర్లతో పాటు వేటకుక్కలతో కాపాలా పెట్టాడు. కోర్టులో వివాదం నడుస్తుండగానే.. మొత్తం 5 ఎకరాల భూమిని తన ఆధీనంలోకి తీసుకొని అందులో షెడ్డులు నిర్మించుకొని పహరా పెట్టుకున్నాడు. ప్రభుత్వ భూమిలోనే అడ్డా వేసుకొని పార్థసారధి, అతని బౌన్సర్లు మద్యం సేవించి భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. నివాసిన ప్రాంతాలకు తాగునీరు అందించేందుకు వాటర్ రిజర్వాయర్ నిర్మించాలని జలమండలి ప్రయత్నాలను పార్థసారధి అడ్డుకున్నారు.

హైడ్రా చొరవతో ప్రభుత్వానికి దక్కిన రూ.750కోట్ల భూమి

పార్థసారథి భూ కబ్జా, దౌర్జన్యాలపై జలమండలి, రెవెన్యూ అధికారులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఫేక్ సర్వే నంబర్ (403/52) తో ప్రభుత్వ భూమిని పార్థసారధి కొట్టేసే ప్రయత్నం చేశాడు. ఈ మేరకు పార్థసారధిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో రెవెన్యూ, జలమండలి అధికారుల ఫిర్యాదులతో 4 క్రిమినల్ కేసులు పెట్టారు. వాస్తవానికి 403 సర్వే నంబర్లో ప్రభుత్వ భూమి ఉంటే 403/52 బై నంబర్ వేసి పార్థసారధి ఆక్రమణలకు పాల్పడినట్టు నిర్ధారణ అయ్యింది. ఆన్ రిజిస్టర్డ్ సేల్ డీడ్ తో 5 ఎకరాల ప్రభుత్వ భూమి తనదంటూ పార్థసారథి క్లెయిమ్ చేస్తున్నట్టు హైడ్రా నిర్ధారించుకుంది. వెంటనే రంగంలోకి దిగిన హైడ్రా షేక్ పేట రెవెన్యూ అధికారుల లేఖ మేరకు భారీ బందోబస్తు మధ్య ఆక్రమణల తొలగింపు చేపట్టింది. పార్థసారథి వేసిన ఫెన్సింగ్ తో పాటు లోపల ఉన్న షెడ్డులను హైడ్రా తొలగించింది. 5 ఎకరాల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ బోర్డులను ఏర్పాటు చేసింది.