విధాత,హైదరాబాద్: మహానగరంతో పాటు శివారు ప్రాంతాల్లో గ్రామీ|ణ నేపధ్యం ఉన్న నేతల ప్రభావం ఓటర్లపై ఎక్కువగా ఉంది. గతంలోనూ, ఇప్పుడూ శివారు ప్రాంతాల్లో వీరి జోక్యం తప్పనిసరిగా మారింది. స్వస్థలంలో రాజకీయం వేరు. బతుకుదెరువు, చదువు, కుటుంబ అవసరాలు, అనివార్య కారణాలు ఏవైనా, రాజధానిలో స్థిరపడి రాజకీయం చేయడం వేరు.
ఇట్లా రాజకీయాలు చేసి, హవా చెలాయించిన నేతలు చాలా మందే ఉన్నారు. ఎమ్మెల్యేలు, కార్పోరేటర్లే కాక, కొంత మంది మంత్రులుగా సైతం పనిచేశారు. ప్రధానంగా ఉమ్మడి రంగారెడ్డి, నల్లగొండ, మెదక్, మహబూబ్నగర్ జిల్లా వాసులు రాజధానిపై రాజకీయ ప్రభావం చూపారు.
రంగారెడ్డి జిల్లా మర్పల్లి మండలానికి చెందిన డాక్టర్ మర్రి చెన్నారెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా సేవలు అందించారు. తొలిదశ తెలంగా|ణ ఉద్యమానికి నాయకత్వం వహించిన చెన్నారెడ్డి వికారాబాద్, మేడ్చల్, సనత్నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా సేవలు అందించారు. సుధీర్ఘ రాజకీయ జీవితంలో కేంద్ర మంత్రిగా, నాలుగు స్టేట్లకు గవర్నర్గా పనిచేశారు.
తెలంగాణ ప్రజా సమితి పేరుతో పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేసి, అన్ని స్థానాలు గెలవడం ఒక చరిత్ర. బలమైన ప్రధానిగా ఉన్న ఇందిరను ఎదిరించి, కొన్నాళ్లు ఉద్యమం చేసినా, తదుపరి పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. చెన్నారెడ్డి కుమారుడు మర్రి శశిధర్ రెడ్డి కూడా సనత్నగర్ నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
సరూర్నగర్ మండలం మామిడిపల్లికి చెందిన పి.శివశంకర్ సికింద్రాబాద్ లోక్సభ సభ్యునిగా పనిచేశారు. కేంద్రమంత్రిగా, గవర్నర్గా ఉన్నారు. కాంగ్రెస్ జాతీయ వ్యవహారాల్లో కొన్నాళ్లు కీలకంగా ఉన్నారు. శివశంకర్ కుమారుడు సుధీర్ కుమార్ సైతం మలక్పేట నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
ప్రధానంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన నేతలు హైదరాబాద్ రాజకీయాల్లో పెనవేసుకుపోయారు. మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ అనారోగ్యం, వయసుపరమైన సమస్యలతో రాజకీయాలకు దూరంగా ఉంటున్నా, ఆయన అనుచరులు, శిష్యులు కీలకంగా ఉన్నారు. మేడ్చల్ నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా, రాజ్యసభ సభ్యులుగా, రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్గా సేవలు అందించిన దేవేందర్ గౌడ్ హవా నగరంలో చాలా ఉండేది.
ఘట్కేసర్ మండలానికి చెందిన డాక్టర్ కె. లక్ష్మణ్ ముషీరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా రెండు సార్లు గెలిచారు. స్టేట్ బిజెపి అధ్యక్షునిగా కూడా చేసిన లక్ష్మణ్ ప్రస్తుతం బిసి మోర్చా జాతీయ అధ్యక్షునిగా బాధ్యతల్లో ఉన్నారు. ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. విద్యార్ధి దశ నుంచి నగర రాజకీయాల్లో లక్ష్మణ్ కీలకంగా ఉన్నారు.
యాచారం మండలానికి చెందిన కోదండరెడ్డి సైతం ముషీరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా నిలిచి, గెలిచారు. ప్రస్తుతం కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఉన్న కోదండ రెడ్డి స్వర్గీయ పి.జనార్ధన్రెడ్డితో కలిసి సిఎల్పి కార్యదర్శిగా చంద్రబాబు ప్రభుత్వంపై అసెంబ్లీలోనూ, బయట పోరాడారు. 1989, 1994లో ఎమ్మెల్యేగా రెండు సార్లు గెలిచారు.
కందుకూరు మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన గంగాపురం కిషన్రెడ్డి ప్రస్తుతం రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవితో పాటు కేంద్రమంత్రిగా పని చేస్తున్నారు. హిమాయత్నగర్, అంబర్పేట నియోజకవర్గాల నుంచి వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కిషన్ 2018లో ఓడిపోయారు. ఆ వెంటే వచ్చిన లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి నిలిచి గెలిచారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి
మాజీ హోంమంత్రి, సోషలిస్టు నేతగా పేరొందిన నాయని నర్సింహారెడ్డి నేరెడుగొమ్ము మండల కేంద్రానికి చెందిన వారు. ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి 1978, 1984, 2004 లో ఎమ్మెల్యేగా గెలిచారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఎమ్మెల్సీగానూ ఎన్నికై తొలి హోంమంత్రిగా సేవలు అందించారు. ఎన్నో కార్మిక సంఘాలకు నాయకత్వం వహించి, జనం మనిషిగా గుర్తింపు తెచ్చుకున్నారు.
ప్రస్తుతం త్రిపుర గవర్నర్గా ఉన్న నల్లు ఇంద్రసేనారెడ్డి మలక్పేట నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షులుగా కీలకసేవలు అందించారు. నగరంలోనే రాజకీయాలు చేసిన ఇంద్రసేనారెడ్డి స్వస్థలం సూర్యాపేట జిల్లా గానుగబండ.
ప్రస్తుతం ఎల్బీనగర్ ఎమ్మెల్యేగా ఉన్న దేవిరెడ్డి సుధీర్ రెడ్డి సొంత ఊరు మునుగోడు నియోజకవర్గంలో ఉంది. ప్రస్తుత ఉప్పల్ శాసనసభ్యులుగా ఉన్న బేతి సుభాష్ రెడ్డి స్వగ్రామం యాదగిరిగుట్ట సమీపంలో ఉంది. అలాగే జూబ్లీ హిల్స్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యేలుగా ఉన్న మాగంటి గోపీనాథ్, అరికెపూడి గాంధీలు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారు కావడం గమనార్హం. ఇలా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన నేతలు నగర రాజకీయాలపై తమదైన ముద్ర వేశారు.