Sitakka | అంగన్వాడీ టీచర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్పెంపు : మంత్రి సీతక్క
రాష్ట్రంలోని అంగన్ వాడీ టీచర్లు, కార్యకర్తలకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ను డబుల్ చేస్తున్నట్లుగా మంత్రి సీతక్క ప్రకటించారు. ప్రస్తుతం అంగన్ వాడీ టీచర్లకు రిటైర్ అయ్యే సమయంలో ప్రభుత్వం రూ. లక్ష ఇస్తుండగా దానిని రెట్టింపు చేసి రూ.2 లక్షలు ఇస్తామని మంత్రి సీతక్క తెలిపారు

అబద్ధాలు అద్భుతంగా చెప్పడంలో కేటీఆర్ దిట్ట
విధాత, హైదరాబాద్ : రాష్ట్రంలోని అంగన్ వాడీ టీచర్లు, కార్యకర్తలకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ను డబుల్ చేస్తున్నట్లుగా మంత్రి సీతక్క ప్రకటించారు. ప్రస్తుతం అంగన్ వాడీ టీచర్లకు రిటైర్ అయ్యే సమయంలో ప్రభుత్వం రూ. లక్ష ఇస్తుండగా దానిని రెట్టింపు చేసి రూ.2 లక్షలు ఇస్తామని మంత్రి సీతక్క తెలిపారు. అలాగే అంగన్ వాడీ కార్యకర్తలకు ప్రస్తుతం రూ.50 వేలు ఇస్తుండగా దానిని రూ.లక్ష అందిస్తామని వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదలను ఇప్పటికే ఆర్ధిక శాఖకు పంపించినట్లు సీతక్క వెల్లడించారు. ఆర్థిక శాఖ నుంచి అనుమతి రాగానే బెనిఫిట్స్ పెంపు అమలు చేస్తామని తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై అంగన్వాడీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత పదేండ్ల బీఆరెస్ పాలన కోట శ్రీనివాస్ రావు కోడి కూర కథ లాగా ఉందని, లక్షలాది పేదలు ఇండ్లు లేక బాధపడుతున్నా ఏవరికి ఇండ్లు కట్టించలేదన్నారు. బంగారు తెలంగాణ, ధనిక రాష్ట్రం అని చెప్తుంటే నిజమని అనుకున్నామని, ధనిక రాష్ట్రంలో రైతులు, ప్రజలకు పథకాలు అందిద్దాం అనుకున్నామన్నారు. పదేళ్లు ప్రజలు మాకు అధికారం ఇచ్చారని, తప్పకుండా ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి అమలు చేస్తామని సీతక్క స్పష్టం చేశారు. మేం ప్రకటించిన పథకాలకు కొంత పెంచి ఎన్నికల్లో ప్రకటించారని, అప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీకు కూడా తెలియదా అని విమర్శించారు. ఇలా ఎన్నో పథకాలు పెంచి ప్రజలను మోసం చేద్దాం అనుకున్నారా అని ప్రశ్నించారు. మా పాలనలో ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, బీఆరెస్ వాళ్ళకి మాత్రం బాధ కలుగుతుందన్నారు. ఇచ్చిన ప్రతి మాట ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు. అబద్ధాలు అద్భుతంగా చెప్పడంలో కేటీఆర్ దిట్ట అని, పదేళ్లలో ఉద్యోగాలు ఇస్తే.. ఉస్మానియా యూనివర్శిటీ కి ఎందుకు వెళ్ళలేదని సీతక్క నిలదీశారు. ఉద్యోగాల విషయంలో కేటీఆర్ మాట్లాడుతుంటే నవ్వొస్తుందన్నారు. డబుల్ పెన్షన్ తీసుకుంటున్న లక్ష్మమ్మ నుంచి రికవారి చేశారని, ఆ విషయం మా దృష్టికి రాలేదన్నారు. మీ ప్రభుత్వంలో కార్పొరేషన్ చైర్మన్లు కూడా పెన్షన్ తీసుకున్నారని ఆరోపించారు. సాగు చేసుకుంటున్న రైతులకు ధరణిలో లేదని రైతు బంధు రాకుండా చేశారని విమర్శించారు.