నీట్‌ పరీక్షలు అక్రమాలపై విచారణ జరిపించాలి … కేటీఆర్‌

నీట్ యూజీ - 2024 పరీక్షలో జరిగిన అవకతవకలపై కేంద్రం తక్షణమే విచారణ జరిపించి విద్యార్థులకు న్యాయం చేయాలని బీఆరెస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు

  • Publish Date - June 8, 2024 / 05:19 PM IST

నీట్‌ పరీక్షలు అక్రమాలపై విచారణ జరిపించాలి
ర్యాంకులు..గ్రేస్ మార్కులపై అనేక అనుమానాలు
బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

విధాత, హైదరాబాద్ : నీట్ యూజీ – 2024 పరీక్షలో జరిగిన అవకతవకలపై కేంద్రం తక్షణమే విచారణ జరిపించి విద్యార్థులకు న్యాయం చేయాలని బీఆరెస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. లక్షలాది మంది వైద్య విద్యార్థుల జీవితాలను ప్రభావితం చేసే నీట్ పరీక్షకు సంబంధించిన కొన్ని వ్యవహారాలు చూస్తుంటే ఖచ్చితంగా అవకతవకలు జరిగినట్లు స్పష్టంగా తెలుస్తుందన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సంవత్సరం నీట్ పరీక్షలో 67 మంది విద్యార్థులు 720/720 మార్కులతో ఫస్ట్ ర్యాంక్ సాధించటం పలు అనుమానాలకు రేపుతున్నాయని తెలిపారు. దీనికి తోడు ఈ సారి చాలా మంది విద్యార్థులు 718, 719 మార్కులు సాధించారని, నీట్ పరీక్షలో (+4, -1) మార్కింగ్ విధానం ఉంటుందని, ఈ లెక్కన 718, 719 మార్కులు రావటమన్నది సాధ్యమయ్యే పనికాదని, దీని గురించి ప్రశ్నిస్తే గ్రేస్ మార్కులు ఇచ్చామని చెబుతున్నారని కేటీఆర్ పేర్కోన్నారు.

కొంతమంది విద్యార్థులకు ఏకంగా 100 వరకు గ్రేస్ మార్కులు ఇచ్చినట్లు తెలుస్తోందని, గ్రేస్ మార్కుల కోసం ఏ విధానం అవలంభించారన్నది చెప్పకపోవటం ఆశ్చర్యం కలిగిస్తోందని, నీట్ ఫలితాలను ఫ్రీపోన్‌ చేసి ఎన్నికల ఫలితాల రోజే హడావుడిగా విడుదల చేయటం కూడా ఎన్నో అనుమానాలను రేకెత్తిస్తోందని ఆరోపించారు. గత 5 ఏళ్లలో తెలంగాణా నుంచి ఏ విద్యార్థి కూడా నీట్ లో టాప్ 5 ర్యాకింగ్‌లో లేరని, దీనికి ఖచ్చితంగా నీట్ పరీక్షలో జరుగుతున్న అక్రమాలే కారణమని మేము నమ్ముతున్నామన్నారు. గ్రేస్ మార్కుల కేటాయింపు కోసం అనుసరించిన విధానాన్ని బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఒక ప్రామాణిక పద్దతిలో ప్రతి విద్యార్థికి మేలు చేసేలా ఈ విధానం ఉండాలని బీఆర్ఎస్ కోరుతుందని, కానీ కొంత మంది విద్యార్థుల గ్రూప్‌కు మాత్రమే మేలు చేసే విధంగా గ్రేస్ మార్కులు కలిపారని, అది సరైన విధానం కాదని తప్పుబట్టారు. ఈ మొత్తం వ్యవహారంపై హై లైవల్ ఎక్స్ పర్ట్ కమిటీతో విచారణ జరిపించాలని బీఆరెస్‌ డిమాండ్ చేస్తోందని చెప్పారు. నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలు, అక్రమాలను బయటపెట్టి అన్యాయం జరిగిన విద్యార్థులకు వారి కుటుంబాలకు న్యాయం చేయాలని, అక్రమాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

Latest News