MLC Kavitha | త్వరలో తెలంగాణ జాగృతి కమిటీలు : జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కవిత
MLC Kavitha | తెలంగాణ జాగృతి జిల్లా, మండల నూతన కమిటీలను త్వరలో ప్రకటిస్తామని జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తెలిపారు.

MLC Kavitha | విధాత, హైదరాబాద్ : తెలంగాణ జాగృతి జిల్లా, మండల నూతన కమిటీలను త్వరలో ప్రకటిస్తామని జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తెలిపారు. బుధవారం తెలంగాణ జాగృతి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర కార్యాలయంలో జాగృతి పతాకావిష్కరణ చేసి మాట్లాడారు. ఆగస్టు 15 నాటికి జాగృతి కమిటీలపై ప్రకటన చేస్తామని తెలిపారు. ఆగస్టు 8న కరీంనగర్లో బీఆర్ఎస్ నిర్వహించే బీసీ గర్జన సభకు తనకు పిలుపు రాలేదని, పిలుపు వస్తే వెళ్తానన్నారు. పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్లపై రాహుల్ గాంధీ మాట్లాడలేదని, ఢిల్లీలో జరిగే కాంగ్రెస్ ధర్నాకు హాజరు కాకుండా ట్వీట్ చేసి ముఖం చాటేశారని విమర్శించారు. బీసీలంటే అంత చులకనా మిస్టర్ ఎలక్షన్ గాంధీ అని కవిత ప్రశ్నించారు. తెలంగాణ బీసీలను మరోసారి కాంగ్రెస్ అగ్రనేత వంచించారని మండిపడ్డారు. గతంలోనూ ఢిల్లీలో ఉండి బీసీల ఆందోళనకు వెళ్లకుండా రాహుల్ గాంధీ అవమానించారని..ఈ రోజు ట్వీట్ వేసి పత్తాలేకుండా పోయి కాంగ్రెస్ వంచన రాజకీయాలను బట్టబయలు చేశారన్నారు. మోసం కాంగ్రెస్ నైజమని మరోసారి నిరూపితమయిందని కవిత దుయ్యబట్టారు. కేంద్రం బీసీ బిల్లు ఆమోదించకపోతే కాంగ్రెస్ న్యాయపోరాటం చేసి తన చిత్తశుద్ది చాటుకోవాలన్నారు. కాంగ్రెస్, బీజేపీలు బీసీ రిజర్వేషన్ పై మోసపూరిత వైఖరిని అనుసరిస్తున్నాయని కవిత విమర్శించారు.