Jubilee Hills by poll Counting | హైద‌రాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్( Jubilee Hills by poll Counting )ప్రక్రియకు సర్వం సిద్ధమైంది. యూసుఫ్‌గూడ కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి స్టేడియంలో ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 42 టేబుల్స్ ఏర్పాటు చేశారు. మొత్తం 10 రౌండ్ల‌లో ఫ‌లితం తేల‌నుంది. ఒక్కో రౌండు ఓట్ల లెక్కింపునకు 45 నిమిషాల సమయం పట్టనుందని అంచనా. మొత్తం ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం 3 గంటలకు పూర్తి అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఒకటో నెంబర్‌ పోలింగ్‌ బూత్‌ షేక్‌పేట డివిజన్‌ నుంచి ప్రారంభమై ఎర్రగడ్డతో కౌంటింగ్ ముగియ‌నుంది.
షేక్‌పేట్ త‌ర్వాత వెంగ‌ళ్రావు న‌గ‌ర్, ర‌హ‌మ‌త్ న‌గ‌ర్, యూసుఫ్‌గూడ‌, సోమాజిగూడ‌, బోర‌బండ‌, ఎర్ర‌గ‌డ్డ డివిజ‌న్ల ఓట్ల‌ను లెక్కించ‌నున్నారు.

ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద 250 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని నగర జాయింట్​ సీపీ తఫ్సీర్​ ఇక్బాల్​ తెలిపారు. 15 ప్లాటూన్ల సిబ్బందిని రప్పిస్తున్నామని ఆర్వో కర్ణన్​ తెలిపారు. 144 సెక్షన్​ అమల్లో ఉంటుందని, అనుమతి ఉన్నవారు మాత్రమే లెక్కింపు కేంద్రం వద్దకు రావాలని సూచించారు. శాంతిభద్రతలకు భంగం వాటిల్లితే తగిన చర్యలు తప్పవని హెచ్చరించారు.