Jurala project | జూరాలకు పోటెత్తిన వరద.. 32 గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల
కృష్ణా నది కి వరద పోటెత్తింది. వరద ఉధృతి భారీ గా ఉండడం తో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నిండుకుండలా మారింది. 32 గేట్లు తెరిచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక్కడి వరద నీరు శ్రీశైలం ప్రాజెక్టు వైపు పరుగులు పెడుతోంది.

ఇన్ ఫ్లో 1.60 లక్షల క్యూ సెక్కులు
ఔట్ ఫ్లో 1.57 లక్షల క్యూ సెక్కులు
శ్రీశైలం ప్రాజెక్టు వైపు భారీగా వరద ప్రవాహం
విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: కృష్ణా నది కి వరద పోటెత్తింది. వరద ఉధృతి భారీ గా ఉండడం తో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నిండుకుండలా మారింది. 32 గేట్లు తెరిచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక్కడి వరద నీరు శ్రీశైలం ప్రాజెక్టు వైపు పరుగులు పెడుతోంది. జూరాల ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుత 7.371 టీఎంసీల నీరు నిలువ ఉంచి వచ్చిన వరద నీటిని దిగువకు వదులుతున్నారు. కృష్ణానది ఎగువ ప్రాంతం లో కురిసిన భారీ వర్షాలకు నది నిండుగా ప్రవహిస్తోంది.
జోగులాంబ గద్వాల జిల్లాకు 16 కిలో మీటర్ల దూరంలో ఉన్న ధరూర్ మండలంలోని రేవులపల్లి గ్రామం సమీపంలో ఈ ప్రాజెక్టు ఉంది.ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు లక్ష ఇరవై వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది . కుడి, ఎడమ కాలువల ద్వారా నీటిని విడుదల చేసి ప్రాజెక్టు ఆయకట్టు కు నీరు అందిస్తారు.ప్రాజెక్టు కుడి కాలువ ను సోమనాద్రి అని నామకారణంగా పిలుస్తారు.
ఈ కాలువ సుమారు 51 కిలో మీటర్ల వరకు నీరు ప్రవహించి గద్వాల, అలంపూర్ నియోజకవర్గాలలోని 37700 ఎకరాలకు సాగునీరును అందిస్తుంది. ప్రాజెక్టు ఎడమ కాల్వను ఎన్టీఆర్ కాలువ గా పిలుస్తారు. ఈ కాలువ ద్వారా ఆత్మకూరు, వనపర్తి , కొల్లాపూర్ నియోజకవర్గాలలోని 64,500 ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఇక్కడ 240 మెగావాట్ల జలవిద్యుత్ ఉత్పాదన కేంద్రాన్ని నిర్మించారు. ప్రాజెక్టు నిర్మాణానికి ముందే అప్పటి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రభుత్వాలు విద్యుత్ గురించి ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి.
ఇక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్తులో సగభాగం కర్ణాటక రాష్ట్రానికి ఇవ్వాలని 1976 ఆగస్టు 4 న ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒప్పంద సంతకాలు చేశారు. విద్యుత్ ఉత్పత్తికి అయ్యే ఖర్చు లో సగ భాగం కర్ణాటక రాష్ట్రం భరించాల్సి ఉంటుందని ఒప్పందం లో ఉంది.అప్పటి నుంచి ఇక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్ ను కర్ణాటక కు సరఫరా చేస్తున్నారు.ప్రస్తుతం ప్రాజెక్టు నీటితో విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది.
జూరాల వద్ద పర్యాటకుల సందడి
జూరాల ప్రాజెక్టు జన సంద్రంగా మారింది. ప్రాజెక్టు కు వరద పోటు పెరగడం తో 32 గేట్లు ఎత్తారు. దీంతో ప్రాజెక్టు వద్ద జల దృశ్యం కనువిందు చేస్తోంది. ఈ నీటి దృశ్యాన్ని చూసేందుకు పర్యాటకులు భారీ సంఖ్య లో తరలివచ్చారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచే కాకుండా కర్ణాటక రాష్ట్రం నుంచి పర్యాటకులు వచ్చి ప్రాజెక్టు వద్ద సందడి చేస్తున్నారు.పర్యాటకుల తాకిడి పెరగడం తో ప్రాజెక్టు అధికారులు అప్రమత్తం అయ్యారు. రక్షణ కోసం ముందస్తు గా పోలీసులను ఉంచారు. వారు ఎప్పటికప్పుడు పర్యాటకులను గమనిస్తూ ఎలాంటి ప్రమాదాలకు గురికాకుండా చర్యలు తీసుకుంటున్నారు.