అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి మంచి ఆఫర్ వచ్చింది, అభివృద్ధికి ఈ సదవకాశాన్ని వినియోగించుకుందామని స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విన్నవించారు
అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి మంచి ఆఫర్ వచ్చింది, అభివృద్ధికి ఈ సదవకాశాన్ని వినియోగించుకుందామని స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విన్నవించారు
అభివృద్ధికి సద్వినియోగం చేసుకుందాం
నన్ను ప్రశ్నించే హక్కు ఎవ్వరికీ లేదు
స్టేషన్ ఘన్ పూర్ ప్రజలకే జవాదారును
పదేండ్లలో భూ కబ్జాలకు పాల్పడలేదు
బీఆర్ఎస్ పార్టీ బలహీనపడుతోందీ
నా బిడ్డ కావ్యను ఆశీర్వదించండి
అనుచరుల సమావేశంలో కడియం శ్రీహరి
విధాత, వరంగల్ ప్రతినిధి: అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి మంచి ఆఫర్ వచ్చింది, అభివృద్ధికి ఈ సదవకాశాన్ని వినియోగించుకుందామని స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విన్నవించారు. గత ఐదేళ్ళు అధికార పార్టీలో ఉన్నప్పటికీ ప్రతిప-క్ష పాత్రకే పరిమితమయ్యామన్నారు. బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కడియం, ఆయన కుమార్తె కావ్య సిద్ధమైన నేపథ్యంలో హైదరాబాద్ లో శనివారం నిర్వహించిన స్టేషన్ ప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలతో కడియం శ్రీహరి సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో ప్రతీ ఒక్కరూ శ్రీహరి ఏ నిర్ణయం తీసుకున్నా తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని నినదించారు. ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ నన్ను ప్రశ్నించే హక్కు ఎవరికీలేదని ఆ హక్కు ఒక్క స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రజలకు మాత్రమే ఉందన్నారు. ఎవరికి కూడా నన్ను విమర్శించే స్థాయి గాని, అర్హత గాని లేదన్నారు. నన్ను ఆశీర్వదించినట్లే నా కూతురును ఆశీర్వదించాలని కోరారు. నా బిడ్డను మీ చేతుల్లో పెడుతున్నా… బిడ్డగా, అక్కగా, చెల్లీగా నిండు మనసుతో ఆశీర్వదించాలన్నారు.
కొంత మంది వచ్చిన అవకాశాలను చెడగొట్టుకొని ఎదుటి వాళ్లపై విమర్శలు చేస్తున్నారనడం గమనార్హం. బిఆర్ఎస్ ప్రస్థానంలో ఒక్క తప్పు కూడా చేయలేదని, అవినీతి, అక్రమాలకు పాల్పడలేదు, రియల్ ఎస్టేట్, భూ కబ్జాలు చేయలేదు, ప్రయివేట్ యూనివర్సీటిలు పెట్టుకోలేదంటూ నన్ను విమర్శించే నైతిక అర్హత ఏ ఒక్కరికి లేదన్నారు. చాలా మంది పార్టీని, ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని విచ్చలవిడిగా ఆస్తులు కూడబెట్టుకున్నారని విమర్శించారు.
ఒడిదుడుకుల్లో బీఆర్ఎస్
బిఆర్ఎస్ పార్టీ ఒడిదుడుకుల్లో ఉందని, నాయకులు చాలా మంది అయోమయంలో ఉన్నారని కడియం వ్యాఖ్యానించారు. అరూరి రమేష్ వద్దు అంటేనే కావ్యకు టికెట్ ఇచ్చారన్నారు. జిల్లాలో చాలా మంది ఇతర పార్టీలలో చేరడంతో పార్టీ బలహీన పడిందన్నారు. మొదటిసారి పోటీ చేస్తున్న కావ్యను ఓడిపోయే పార్టీ నుండి పోటీ వద్దనుకున్నామని, ఎవరిని అడగకుండానే ఈ నిర్ణయం తీసుకున్నాం, క్షమించాలని కోరారు.
కాగా.. తాను పార్టీ మారుతానంటే ఈ స్థాయిలో విమర్శలు ఎందుకు చేస్తున్నారో మీరు అర్థం చేసుకోవాలన్నారు.కడియం కావ్య మాట్లాడుతూ అందరూ ఆస్తులను కాపాడుకోవడానికి పార్టీలు మారుతారు.. కానీ శ్రీహరి మాత్రం నియోజకవర్గ కార్యకర్తలను కాపాడుకోవడానికి పార్టీ మారుతున్నారని అన్నారు. మీ ఇంటి బిడ్డగా నన్ను నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరారు.