బీఆరెస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు పార్లమెంటు ఎన్నికల ప్రచార బస్సుయాత్ర శుక్రవారం నుంచి యథావిధిగా కొనసాగనున్నది. కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై కేంద్ర ఎన్నికల సంఘం 48 గంటల పాటు
విధాత : బీఆరెస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు పార్లమెంటు ఎన్నికల ప్రచార బస్సుయాత్ర శుక్రవారం నుంచి యథావిధిగా కొనసాగనున్నది. కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై కేంద్ర ఎన్నికల సంఘం 48 గంటల పాటు నిషేధం విధించడంతో బస్సుయాత్రకు తాత్కాలిక బ్రేక్ పడింది. బుధవారం రాత్రి 8 గంటల నుంచి 48 గంటలు పాటు నిషేధం వర్తించేలా ఉత్తర్వులు జారీ చేసింది. నిషేధం అమలులో ఉన్న సమయంలో బహిరంగ సభలు, ప్రదర్శనలు, ర్యాలీలు, ఇంటర్వ్యూలు, రోడ్షోలు, మీడియాలో బహిరంగంగా మాట్లాడొద్దని సూచించింది. షెడ్యూల్ ప్రకారం మహబూబాద్లో రోడ్షో నిర్వహించి వరంగల్లో బస అనంతరం తొమ్మిదవరోజు గురువారం కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో రోడ్ షో నిర్వహించి.. వీణవంకలో బస చేయాల్సింది.
ఎన్నికల సంఘం విధించిన నిషేధ గడువు ముగిసిన అనంతరం శుక్రవారం నుంచి కేసీఆర్ యథావిధిగా రోడ్షో నిర్వహించనున్నారు. శుక్రవారం 8 గంటల తర్వాత పెద్దపల్లి జిల్లా రామగుండంలో బస్యాత్ర కొనసాగించి.. అదే రోజు రాత్రి రామగుండంలోనే బస చేయనున్నారు. శనివారం 4వ తేదీన సాయంత్రం మంచిర్యాలలో రోడ్డు షో, 5న జగిత్యాల రోడ్డు షో, 6న సాయంత్రం నిజామాబాద్ రోడ్డు షో, 7న కామారెడ్డి రోడ్డు షో, అనంతరం మెదక్ లో రోడ్డు షో, 8న నర్సాపూర్ రోడ్డు షో అనంతరం పటాన్ చెరులో రోడ్డు షో, 9న సాయంత్రం కరీంనగర్ రోడ్డు షో, 10న ఆఖరి రోజున సిరిసిల్లలో రోడ్డు షో, అనంతరం సిద్దిపేట లో బహిరంగసభతో కేసీఆర్ బస్సు యాత్ర ముగుస్తుంది.