Site icon vidhaatha

పవన్‌తో భేటీయైన కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌


విధాత, హైదరాబాద్‌: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్‌రెడ్డి, ఎంపీ లక్ష్మణ్‌లు కలిశారు. ఈ సందర్భంగా వారు తెలంగాణలో జనసేన పోటీ చేయకుండా తమకు మద్దతు ఇవ్వాలని కోరినట్టు సమాచారం. ఏపీలో మిత్ర పక్షంగా కొనసాగుతున్న నేపధ్యంలో తెలంగాణలో తమకు మద్దతునివ్వాలని వారు పవన్‌ను కోరారు. దీనిపై పవన్ నిర్ణయం ఏమిటన్నది తెలియరాలేదు.


అయితే తెలంగాణలో పూర్తిగా పోటీకి దూరంగా ఉండి బీజేపీకి మద్దతునివ్వాలా లేక కొన్ని సీట్లు తీసుకుని ఆ పార్టీకి మద్దతునివ్వాలా అన్నదానిపై జనసేన అధినేత పవన్ డైలామాలో ఉన్నారని, పార్టీ ముఖ్యులతో చర్చించాకా తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని పవన్ చెప్పినట్లుగా తెలుస్తున్నది.


గురువారం న్యూ ఢీల్లీలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ ఉండటం, ఈ భేటీలో తెలంగాణ బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా ఫైనల్ కానుండటంతో, పవన్‌తో కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌ల చర్చలు ఆసక్తి రేపాయి. పవన్ ఏమైనా సీట్లు కోరినట్లయితే ఆ సీట్ల వరకు తొలి జాబితాలో అభ్యర్థులను వాయిదా వేసి, రెండు పార్టీల మధ్య మద్దతు, పొత్తు, సీట్ల సర్ధుబాటుపై స్పష్టత వచ్చాకా ఆ సీట్లపై నిర్ణయం తీసుకోవాలన్న బీజేపీ ఆలోచన మేరకే పవన్‌తో కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌లు భేటీ అయ్యారని సమాచారం.

Exit mobile version