Knife sharpeners | హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో కత్తుల పదునుకు గిరాకీ పెరిగింది. పాతబస్తీలో పొద్దట్నుంచి సాయంత్రం వరకు కత్తులకు పదును పెడుతూ పలువురు జీవనోపాధి పొందుతున్నారు. ఇప్పుడే ఇంత డిమాండ్ ఎందుకు వచ్చిందంటే బక్రీద్ పండుగ నేపథ్యంలో.
బక్రీద్ పండుగకు ముస్లింలు గొర్రెలను, మేకలను బలిస్తారు. ఈ క్రమంలో వాటిని బలిచ్చేందుకు పదునైన కత్తులను ఉపయోగిస్తారు. ఏడాదికి ఒకసారి వచ్చే ఈ పర్వదినానికి భారీ ఎత్తున గొర్రెలు, మేకల తలలు తెగుతాయి. దీంతో కత్తులకు పదును పెట్టించుకునేందుకు ముస్లింలు సిద్ధమయ్యారు.
అయితే కత్తులకు పదును పెట్టే వ్యక్తులు కూడా పాతబస్తీ వంటి ప్రాంతాల్లో పర్యటిస్తూ జీవనోపాధి పొందుతున్నారు. వీరంతా మహారాష్ట్రలోని నాందేడ్, బీద్, పర్భానీ, లాతూర్ జిల్లాల నుంచి వచ్చి కత్తులకు పదును పెడుతున్నారు. ఇండ్లల్లో ఉపయోగించే కత్తులకు పదును పెడితే ఒక్కో కత్తికి రూ. 50 చొప్పున వసూలు చేస్తున్నట్టు షేక్ ఫరూక్ తెలిపాడు. ఇలా రోజుకు రూ. 2 వేలకు సంపాదిస్తున్నట్లు పేర్కొన్నాడు.
ఇక మాంసం వ్యాపారులకు సంబంధించిన కత్తులకు పదును పెడితే ఒక్కో కత్తికి రూ. 200 నుంచి రూ. 300 వరకు వసూలు చేస్తున్నారు. ఈ బిజినెస్ 15 రోజుల నుంచి ప్రారంభమైందని, బక్రీద్ పండుగ వరకు కొనసాగుతుందన్నారు. వీరంతా రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో నిద్రిస్తూ.. పొద్దున్నే తమ వ్యాపారం కోసం బస్తీల్లోకి బయల్దేరుతున్నారు.
