Telangana | ధరణి, కొత్త రెవెన్యూ చట్టంపై అఖిల పక్షానికి బీఆరెస్, బీజేపీ, ఎంఐఎంల డుమ్మా
ధరణి పోర్టల్ ను పూర్తిగా ప్రక్షాళన చేసి ప్రస్తుతం ఉన్న రెవెన్యూ చట్టం స్థానంలో కొత్త చట్టం తీసుకవచ్చే ఉద్ధేశంతో రూపొందించిన నూతన చట్టంపై ప్రభుత్వం గురువారం నిర్ణయించిన అఖిల పక్ష సమావేశానికి బీఆరెస్, బీజేపీ, ఎంఐఎంలు డుమ్మా కొట్టడం చర్చనీయాంశమైంది

రాతపూర్వకంగానైనా చెప్పాలన్న కోదండ రెడ్డి
విధాత, హైదరాబాద్ : ధరణి పోర్టల్ ను పూర్తిగా ప్రక్షాళన చేసి ప్రస్తుతం ఉన్న రెవెన్యూ చట్టం స్థానంలో కొత్త చట్టం తీసుకవచ్చే ఉద్ధేశంతో రూపొందించిన నూతన చట్టంపై ప్రభుత్వం గురువారం నిర్ణయించిన అఖిల పక్ష సమావేశానికి బీఆరెస్, బీజేపీ, ఎంఐఎంలు డుమ్మా కొట్టడం చర్చనీయాంశమైంది. హైదరాబాద్ ఫతే మైదాన్ క్లబ్లో ధరణి అధ్యయన కమిటీ కన్వీనర్, కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన అఖిల పక్ష సమావేశానికి సీపీఐ, సీపీఎం, టీజేఎస్ పార్టీలతో సహా ధరణి సమస్యలపై పోరాటం చేసిన ప్రజాసంఘాల నేతలు, మేధావులు హాజరయ్యారు.
కొత్త చట్టంలో ఉండాల్సిన అంశాలపై ఆ పార్టీల, ప్రజా సంఘాల నేతలు, మేధావుల నుంచి సలహాలు సూచనలు స్వీకరించారు. అయితే ఈ అఖిల పక్ష సమావేశానికి బీఆరెస్, బీజేపీ, ఎంఐఎం దూరంగా ఉన్నాయి. నూతన రెవెన్యూ చట్టంపై అభిప్రాయ సేకరణ కోసం నిర్వహించిన అఖిల పక్ష సమావేశం అనంతరం కోదండరెడ్డి గాంధీభవన్లో మీడియాతో మాట్లాడారు. ధరణి సమస్యల కారణంగా అనేక మంది రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని తాము అధికారంలోకి వచ్చాక స్పెషల్ డ్రైవ్ నిర్వహించి దాదాపు 2 లక్షల అప్లికేషన్లను పరిష్కరించగలిగామన్నారు. ధరణి ప్రక్షాళన, నూతన రెవెన్యూ చట్టం రూపకల్పనపై ప్రభుత్వం నిర్వహించిన అఖిల పక్షం సమావేశాలకు ప్రతిపక్ష బీఆరెస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలు రాకపోవడం బాధ్యతారాహిత్యమని విమర్శించారు.
సమావేశానికి రాకపోయినా పర్వాలేదని, కనీసం దీనిపై మీ పార్టీ సలహాలు సూచనలు రెవెన్యూ శాఖ సెక్రటరీకి కనీసం రాతపూర్వకంగానైనా పంపించి సహకరించాలని కోరారు. ఇది ప్రజలకు ఉపయోగపడే అంశం అని అందువల్ల అందరూ సహకరించాలని కోరారు. గతంలో జరిగిన తప్పిదాలు పునరావృతం కావద్దనే మా ప్రయత్నం అని చెప్పారు. గత ప్రభుత్వం విధాన పర నిర్ణయాల్లో ప్రతిపక్షాలను గౌరవించకుండా, అఖిల పక్ష సమావేశాలు పెట్టకుండా నిరంకుశంగా, అప్రజాస్వామికంగా వ్యవహారించిందని అంతా విమర్శించారన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతంగా కొత్త రెవెన్యూ చట్టంపై అఖిల పక్ష సమావేశం పెట్టిందన్నారు. అఖిల పక్ష సమావేశాలు పెట్టకపోతే విమర్శలు..పెడితే గైర్హాజర్ కావడం అవకాశ వాద రాజకీయమన్నారు. అందుకే విజ్ఞులైన ప్రతిపక్షాలు ధరణితో రైతులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కొత్త రెవెన్యూ చట్టంపై తమ సలహాలు, సూచనలు ప్రభుత్వానికి అందించాలని కోరారు.