Site icon vidhaatha

KTR | మీ రాజకీయాల కోసం పేదల ఇండ్లు కూల్చారు: కేటీఆర్

చట్టబద్ధమైన ఇళ్లను ప్రభుత్వమే కూల్చివేసింది
విచారణ జరిపి న్యాయం చేయాలి
సొంత పార్టీ నేతల అరాచకాలను నివారించాలి
ఫిర్జాదీగూడ ఇళ్ల కూల్చివేతపై సీఎం రేవంత్‌రెడ్డికి కేటీఆర్ లేఖ

విధాత, హైదరాబాద్ : ఫిర్జాదీగూడలో ఇళ్ల కూల్చివేతపై బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. ట్విటర్ వేదికగా లేఖలో ఆయన ఇళ్ల కూల్చివేతపై ప్రభుత్వం తీరును ప్రశ్నించారు. మీ కాంగ్రెస్ నాయకులు అమ్మిన, మీ కాంగ్రెస్ ప్రభుత్వం క్రమబద్ధీకరణ చేసిన ప్లాట్లలో నిర్మించుకుంటున్న ప్రజల ఇండ్లను మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఏమి ఆశించి ఈరోజు కూలగొట్టించాడో ఒకసారి విచారణ చేయించండని కేటీఆర్ సీఎం రేవంత్‌రెడ్డిని తన లేఖలో కోరారు. ప్రజా పాలనలో ప్రజలకు మద్దతుతో వెళ్లిన బీఆరెస్‌ నాయకులను పోలీసులతో నిర్బంధిస్తారా..? మీకు అన్నగా ప్రచారం చేసుకుంటూ సుధీర్ రెడ్డి మేడ్చల్ అసెంబ్లీ పరిధిలో చేస్తున్న అరాచకాలపై మీరు ఇంటెలిజెన్స్ నివేదిక తెప్పించుకోండి.

లేదంటే ప్రజలు తిరగబడుతారు. మీ నిర్బంధాలు ప్రజాగ్రహాన్ని నిలువరించలేవని హెచ్చరించారు. అమాయక ప్రజలకు ఈ ప్లాట్లు అమ్మింది కాంగ్రెస్ నాయకుడు రాందాస్ గౌడ్, మరో కాంగ్రెస్ నాయకుడు జగదీశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ కార్పొరేటర్ అమర్ సింగ్ కుటుంబమని కేటీఆర్ తెలిపారు. ఈ ప్లాట్లను 2008లో నాటి సీఎం రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం క్రమబద్ధీకరించిందని, గతంలో రెవెన్యూ అధికారులు ఇది పట్టా భూమిగా ఎన్వోసీ జారీ చేశారని, ప్రభుత్వ నిబంధనలకు లోబడి మున్సిపల్ అధికారుల అనుమతి తీసుకొని చాలా మంది ప్రజలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని ఇంటి నిర్మాణం చేసుకుంటున్నారని తెలిపారు. కానీ మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అధికారులను వేధించి అమాయక ప్రజలు లక్షలు పోసి నిర్మించుకున్న ఇండ్లను ఈ రోజు కూలగొట్టించాడని పేర్కోన్నారు.

పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని సాయిప్రియ, సత్యనారాయణ పురం కాలనీ ప్లాట్ల యజమానుల సమస్యను శాశ్వతంగా తీర్చాలనే లక్ష్యంతో నాడు బీఆరెస్‌ ప్రభుత్వం 118 జీవో పరిధిలో చేర్చి ప్లాట్ ఓనర్స్ కు మేలు చేయడం జరిగిందన్నారు. కానీ ప్రజా పాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అసమర్థ ప్రభుత్వం అమాయక ప్లాట్ ఓనర్స్ ఇండ్లను కూల్చివేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలపై కక్షగట్టి చేస్తున్న వేధింపులకు ప్రజలు ముగింపు పలకడం ఖాయం. భవిష్యత్తులో మా బీఆరెస్‌ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ ప్లాట్ ఓనర్లను న్యాయం చేయడం జరుగుతుందన్నారు. మా బీఆరెస్‌ పార్టీ మేయర్ జక్క వెంకట్ రెడ్డిని, కార్పొరేటర్లను పార్టీ మారేందుకు మీరు వేధిస్తున్నారని, మేము ఇలా వేధించాలి అనుకుంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నామరూపాల్లేకుండా పోయేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వేధింపులకు మళ్ళీ వడ్డీతో సహా చెల్లిస్తాం. మా నాయకులను, మా మేయర్ ను, మా కార్పొరేటర్లను కంటికి రెప్పలా కాపాడుకుంటామని కేటీఆర్ తెలిపారు.

Exit mobile version