Gutta Sukender Reddy | అర్హులకే రైతుభరోసా, రుణమాఫీ దక్కాలి: శాసన మండలి చైర్మన్ గుత్తా

రైతుభరోసా, రైతు రుణమాఫీ అర్హులకు మాత్రమే దక్కేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం ఆహ్వానించదగ్గ పరిణామమని, గతంలో మాదిరిగా ప్రజాధనం దుబారా కాకుండా అనవసర ఖర్చులు తగ్గించుకోవడం మంచిదని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు

Gutta Sukender Reddy | అర్హులకే రైతుభరోసా, రుణమాఫీ దక్కాలి: శాసన మండలి చైర్మన్ గుత్తా

అర్హులకే రైతుభరోసా, రుణమాఫీ దక్కాలి
మండలి రద్ధు ప్రచారం అసంబద్ధం
ఫిరాయింపులపై గతమే మాకు మార్గదర్శకం
శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి

విధాత, హైదరాబాద్ : రైతుభరోసా, రైతు రుణమాఫీ అర్హులకు మాత్రమే దక్కేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం ఆహ్వానించదగ్గ పరిణామమని, గతంలో మాదిరిగా ప్రజాధనం దుబారా కాకుండా అనవసర ఖర్చులు తగ్గించుకోవడం మంచిదని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం నల్లగొండలోని తన నివాసంలో మీడియా చిట్ చాట్‌లో మాట్లాడారు. రైతు భరోసా కేవలం పది ఎకరాల వరకు ఇస్తే చాలని, సేద్యం చేసే భూములకు మాత్రమే ఇవ్వాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టడం మంచిదేనన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని 7లక్షల కోట్ల అప్పు ఉందని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే శ్వేత పత్రం విడుదల చేసిందని గుర్తు చేశారు. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యలపై రెండు తెలుగు రాష్ట్రాలు సీఎంలు భేటీ అవ్వడం శుభ పరిణామమన్నారు.

విభజన సమస్యలపై పంతాలకు పోకుండా ఇరు రాష్ట్రాల సమస్యలకు శాశ్వత పరిష్కారం చేసుకోవాలని సూచించారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు త్వరలలోనే పరిష్కరం అవుతాయి అనే నమ్మకం సీఎంల భేటీతో ఏర్పడిందన్నారు. రెండు రాష్ట్రాల సీఎంలు కలవడాన్ని అభివృద్ధి కోణంలో చూడాలని, అందులో రాజకీయ కోణం చూడవద్దన్నారు. ప్రతిపక్ష పార్టీలు చేసే బెదిరింపులకు అస్సలు బయపడవద్దని, అప్పుడే అభివృద్ధి పనులు చేసుకోగలుగుతామన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఎత్తిపోతల ద్వారా నీటిని తీసుకోవడం తప్ప మినహా మరో మార్గం లేదని, కృష్ణా జలాల విషయంలో న్యాయబద్ధంగా తెలంగాణకు వాటా ఇవ్వడానికి ఏపీ ప్రభుత్వం సహకరించాలని సూచించారు.

ఇరిగేషన్ ప్రాజెక్టులు అన్ని త్వరితగతిన పూర్తి చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని, వచ్చే రెండేళ్లలో ఎస్ఎల్‌బీసీ పెండింగ్ పనులు పూర్తి చేస్తే జిల్లాలో సాగునీటి సమస్యలు తీరుతాయని పేర్కోన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు చాలా కష్టపడుతున్నారని, జిల్లాలో ఉన్న పెండింగ్ పనులన్నీ త్వరగా పూర్తి అవుతాయని అనుకుంటున్నామన్నారు. శాసన మండలి రద్దు అనేది అసంబద్దమైనదని,. అలాంటి పరిస్థితి ఏం లేదని కొట్టిపారేశారు. 2026లో పునర్విభజన చట్టం అమలయ్యే అవకాశం ఉందని, ఈ చట్టం అమలైతే తెలంగాణలో 34, ఏపీలో 50 సీట్లు పెరిగే అవకాశం ఉందన్నారు. శాసన మండలి చైర్మన్ హోదాలో ఉండి రాజకీయాల గురించి మాట్లాడనని, పార్టీ ఫిరాయింపుల విషయంలో గతంలో ఉన్న శాసన మండలి ఛైర్మన్‌, స్పీకర్‌లు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో మేము కూడా అలాగే తీసుకుంటామని గుత్తా స్పష్టం చేశారు.