Site icon vidhaatha

Jagdish Reddy | కొలంబ‌స్, వాస్కోడిగామా లాగా రేవంత్ ఒక ప‌త్రం ప‌ట్టుకొచ్చి చ‌దివారు.. ఎమ్మెల్యే జ‌గ‌దీశ్ రెడ్డి విమ‌ర్శ‌లు

హైద‌రాబాద్ : విద్యుత్ మీట‌ర్ల విష‌యంలో శాస‌న‌స‌భ‌ను, రాష్ట్ర రైతాంగాన్ని సీఎం రేవంత్ రెడ్డి త‌ప్పుదోవ ప‌ట్టించే ప్ర‌య‌త్నం చేశార‌ని మాజీ విద్యుత్ శాఖ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జ‌గ‌దీశ్ రెడ్డి మండిప‌డ్డారు. కొలంబ‌స్, వాస్కోడిగామా  లాగా సీఎం రేవంత్ ఒక ప‌త్రం ప‌ట్టుకొచ్చి, కొన్ని ప‌దాల‌ను తొల‌గించి చ‌దివి త‌ప్పుదోవ ప‌ట్టించే ప్ర‌య‌త్నం చేశార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. శాస‌న‌స‌భ‌లో విద్యుత్ ప‌ద్దుల‌పై చ‌ర్చ సంద‌ర్భంగా జ‌గ‌దీశ్ రెడ్డి మాట్లాడారు.

రైతుల‌కు న‌ష్టం జ‌రిగే చ‌ర్య‌ల‌కు కేసీఆర్ అంగీక‌రించ‌లేదు అని జ‌గ‌దీశ్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. ఇదే స‌భ‌లో హ‌రీశ్‌రావు మాట్లాడుతూ.. రూ. 30 వేల కోట్ల న‌ష్టానికి సిద్ధ‌ప‌డ్డాం కానీ.. బోరు బావుల వ‌ద్ద మీట‌ర్లు పెట్ట‌లేదని గుర్తు చేశారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. హ‌రీశ్‌రావు మాట్లాడింది త‌ప్ప‌ని చెప్పారు. కేసీఆర్, మోదీ సంత‌కాలు పెట్టార‌ని కొలంబ‌స్, వాస్కోడిగామా లాగా రేవంత్ రెడ్డి ఒక ప‌త్రం ప‌ట్టుకొచ్చారు. కొన్ని ప‌దాలు డిలీట్ చేసి సీఎం రేవంత్ రెడ్డి చ‌దివారు అని గుర్తు చేశారు.

హ‌రీశ్‌రావు కేవ‌లం ఉద‌య్ ప‌థ‌కం గురించి చెప్పారు. ఈ ప‌థ‌కంలో 27 రాష్ట్రాలు చేరాయి. ఈ ప‌థ‌కం డిస్క‌లం ఆర్థిక ప‌రిస్థితిని స‌రిదిద్ద‌డానికి తీసుకొచ్చారు. ఉద‌య్ ప‌థ‌కంలో మా కంటే ముందే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు చేరాయి. ఆ త‌ర్వాత మేం కూడా చేరాం.. రూ. 90 వేల కోట్లు పెట్టి విద్యుత్ స‌ర‌ఫ‌రా వ్య‌వ‌స్థ‌ను బ‌లోపేతం చేశామ‌ని జ‌గ‌దీశ్ రెడ్డి గుర్తు చేశారు. సీఎం ప్ర‌జ‌ల‌ను, రైతుల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించే ప్ర‌య‌త్నం చేశారు.

ప‌దేండ్ల బీఆర్ఎస్ పాల‌న‌లో రాష్ట్రంలో స్థాపిత విద్యుత్ సామ‌ర్థ్యం పెరిగింద‌ని జ‌గ‌దీశ్ రెడ్డి తెలిపారు. 2014కు ముందు 24 గంట‌ల విద్యుత్ ఇస్తే.. టీఆర్ఎస్ అధికారంలోకి వ‌చ్చిన రాష్ట్రం అంధ‌కారం అయింద‌ని రాజ‌గోపాల్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఒక్క ట్రాన్స్‌ఫార్మ‌ర్, పోల్స్ పెట్ట‌లేద‌ని చెబుతున్నారు. టీఆర్ఎస్ పార్టీ వ‌చ్చిన త‌ర్వాత ఇండ్ల మీద నుంచి విద్యుత్ లైన్లు వెళ్ల‌లేదు. 2014కు ముంద క‌రెంట్ లైన్ల కింద ఇండ్లు క‌ట్టుకున్నారు. చాలా వ‌ర‌కు అలాంటి క‌నెక్ష‌న్ల‌ను తొల‌గించాం అని జ‌గ‌దీశ్ రెడ్డి తెలిపారు.

తెలంగాణ ఏర్పాటు నాటికి 7 వేల మెగావాట్లు.. 2024 నాటికి 19483 మెగావాట్లు.. అంటే ప‌దేండ్ల‌లో 11 వేలు పెరిగింది. 2014లో రాష్ట్రంలో వ్య‌క్తిగ‌త విద్యుత్ వినియోగం 1,196 కిలో వాట్లు. 2024లో రాష్ట్రంలో వ్య‌క్తిగ‌త విద్యుత్ వినియోగం 2,349 కిలోవాట్లు. బీఆర్ఎస్ ప్ర‌భుత్వంలో విద్యుత్ వినియోగం పెరిగింది. 2014 జూన్‌లో అధికారంలోకి రాగా నవంబ‌ర్ నాటికి 24 గంట‌ల విద్యుత్ ఇచ్చాం. సోలార్ కెపాసిటీ.. 60 ఏండ్ల‌లో 74 మెగావాట్లు. మేం వ‌చ్చిన త‌ర్వాత 6132 మెగ‌వాట్లు ఇచ్చాం. 2014కు ముందు విద్యుత్ పీక్ డిమాండ్ 5661 మెగ‌వాట్లు.. మేం అధికారంలోకి వ‌చ్చాక పీక్ డిమాండ్ 15497 మెగావాట్లు అని జ‌గ‌దీశ్ రెడ్డి పేర్కొన్నారు.

Exit mobile version