అధిక ఆదాయ వర్గాలను రైతు రుణమాఫీ నుంచి మినహాయిస్తే ఎలా ఉంటుందన్న దానిపై సర్కారు సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ఏ విధంగా అమలు చేస్తున్నారో.. అదే విధానాన్ని రాష్ట్రంలో కూడా అమలుచేస్తే ఎలా ఉంటుందన్న దానిపై చర్చిస్తున్నట్టు సమాచారం
షరతులతో రుణమాఫీ!
పీఎం కిసాన్ తరహాలో అమలుకు యోచన
ఐటీ చెల్లించే వారికి మాఫీ మినహాయింపు?
ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులూ ఆ జాబితాలో
నిజమైన రైతులు లబ్ధి పొందడమే లక్ష్యం
నిధుల సమీకరణపై ప్రభుత్వం కసరత్తు
ఆగస్ట్ 15న రుణమాఫీ దిశగా అడుగులు
వారం వ్యవధిలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం
విధాత: అధిక ఆదాయ వర్గాలను రైతు రుణమాఫీ నుంచి మినహాయిస్తే ఎలా ఉంటుందన్న దానిపై సర్కారు సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ఏ విధంగా అమలు చేస్తున్నారో.. అదే విధానాన్ని రాష్ట్రంలో కూడా అమలుచేస్తే ఎలా ఉంటుందన్న దానిపై చర్చిస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా ఈ పథకంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వాళ్లు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయం పన్నులు చెల్లించే వారిని మినహాయించింది. ఇదే తీరుగా రైతు రుణమాఫీ పథకం అమలుకు నిబంధనలు వర్తింపజేస్తే ఎలా ఉంటుందన్న అంశాన్ని అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నట్టు తెలుస్తున్నది.
ఆగస్ట్ 15న రుణ మాఫీ
ఆగస్ట్ 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎట్టి పరిస్థితిలోనూ రాష్ట్ర రైతులందరికీ రుణమాఫీ చేయాలన్న దృఢ నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఉన్నారు. ఈ మేరకు రైతు రుణమాఫీ అమలుకు రోడ్ మ్యాప్ తయారు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి వ్యవసాయ, ఆర్థిక శాఖల అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో రైతు రుణమాఫీ అమలు దిశగా ప్రభుత్వ అధికారులు తమ కార్యాచరణను వేగవంతం చేశారు. మరో వైపు రుణమాఫీపై చర్చించేందుకు, విధివిధానాలు ఖరారు చేసేందుకు వారం రోజుల్లో రాష్ట్ర మంత్రివర్గాన్ని సమావేశపర్చాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. రుణమాఫీ చేసేందుకు అవసరమైన ప్రభుత్వపరమైన నిర్ణయాలపై ఈ సమావేశంలో చర్చిస్తారు. క్యాబినెట్ సమావేశం నాటికి పూర్తి స్థాయి సమాచారాన్ని అధికారులు సీఎంకు అందజేయనున్నారు. రైతు రుణమాఫీకి ఏ మేరకు నిధులు అవసరం? వాటిని సమీకరించే మార్గాలేంటి? అనే దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారని సమాచారం.
30వేల కోట్ల వరకూ అవసరం!
రైతు రుణమాఫీని ఏకకాలంలో అమలు చేయడానికి రూ.25 వేల కోట్ల నుంచి రూ.30 వేల కోట్ల వరకు నిధులు అవసరం కావచ్చునన్న అంచనాకు అధికారులు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే బీఆరెస్ ప్రభుత్వం లక్ష రూపాయల రుణమాఫీకి రూ.19 వేల కోట్లు గతంలో ప్రకటించింది. ఇవి కాకుండా అదనంగా మరో రూ.10 వేల కోట్ల వరకు అవసరం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితిలో ఇంత మొత్తంలో నిధుల సేకరణ ఇబ్బందికరమైన అంశమే. దీంతో రైతుల రుణాలన్నింటినీ ప్రభుత్వ అప్పుగా మార్చుకొని, రైతులకు క్లియరెన్స్ ఇచ్చే అంశంపై కూడా బ్యాంకులతో చర్చించాలన్న యోచనలో అధికారులున్నారని తెలుస్తోంది. దీనికి బ్యాంకులు సమ్మతిస్తే సీఎంకు అధికారులు సంబంధిత సమాచారాన్ని చేరవేసే అవకాశం ఉంది. రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం గడువులోగా రుణమాఫీ చేసేందుకు సన్నాహాలు చేయాలని ఇటీవలే ముఖ్యమంత్రి వ్యవసాయ శాఖ, ఆర్థిక శాఖ అధికారులను ముఖ్య మంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో రుణమాఫీ అమలు చేసేందుకు ఎన్ని నిధులు అవసరం.. దానికి తగ్గట్లుగా నిధుల సమీకరణకు ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలు, అందుబాటులో ఉన్న వనరులన్నింటినీ ప్రభుత్వం పరిశీలిస్తోంది. మరోవైపు రుణమాఫీ అమలుకు ఏ తేదీని కటాఫ్గా తీసుకోవాలి.. అసలైన అర్హులైన రైతులందరికీ లబ్ధి చేకూరేలా విధివిధానాలు ఎలా ఉండాలనే కసరత్తు మొదలు పెట్టింది.
కిసాన్ సమ్మాన్ దారిలో వెళితే!
గతంలో జరిగిన రుణమాఫీ అమలు తీరును పరిశీలించటంతో పాటు అవసరమైతే ఇతర రాష్ట్రాల్లో రుణమాఫీ పథకాలు, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలకు అనుసరించిన పద్ధతులను అధికారులు అధ్యయనం చేస్తున్నారు. వాటి ప్రయోజనాలు, అనుసరిస్తున్న విధి విధానాలు, నిర్దేశించిన అర్హతలను కూడా పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్) పథకంలో భాగంగా దేశంలో అర్హులైన రైతులందరికీ ప్రతి ఏడాది రూ.6 వేలు ఆర్థిక సాయం అందిస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, జడ్పీ ఛైర్మన్లు, రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు, కేంద్ర రాష్ట్ర ఉద్యోగులు, అధిక ఆదాయం ఉండి ఐటీ చెల్లించేవారిని ఈ పథకం నుంచి మినహాయించింది. రుణమాఫీ అమలుకు అటువంటి ప్రత్యేక మార్గదర్శకాలు పాటించాలా..? వీటితో అసలైన రైతులకు మేలు జరుగుతుందా? ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ప్రతి రైతుకు మేలు జరగాలంటే ఎలాంటి విధి విధానాలుండాలి.. అనే విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వం కసరత్తును ముమ్మరం చేస్తున్నది. ప్రభుత్వం రుణమాఫీతో చేయూతను అందించటం ద్వారా రైతుల చేతులను బలోపేతం చేయడానికి రేవంత్ రెడ్డి దృఢ నిశ్చయంతో ఉన్నారు. అసలైన రైతులు, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న రైతుల కుటుంబాలన్నీ ప్రభుత్వం అందించే లబ్ధిని అందుకునేలా మార్గదర్శకాలుండాలని ఇప్పటికే అధికారులను అప్రమత్తం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం నిర్ణీత గడువులోగా పంట రుణాలు మాఫీ చేయటాన్ని ముఖ్యమంత్రి అత్యంత ప్రాధాన్యాంశంగా చేపట్టారు. పంట పండించే ప్రతి పేద రైతుకు లబ్ధి చేకూరేలా ఈ పథకం అమలు చేసి తీరాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అందుకే రైతు రుణమాఫీ పథకం అమలు దిశగా ప్రభుత్వం వేగంగా కార్యాచరణ మొదలు పెట్టింది.