- బెయిల్పై సుప్రీం కీలక వ్యాఖ్యలు
- కేజ్రీవాల్ కస్టడీ 20వరకు పొడిగింపు
- కవిత కేసు విచారణ 21కి వాయిదా
- వచ్చే వారం బెయిల్ వస్తదన్న కేటీఆర్
న్యూఢిల్లీ : ఢిల్లీ లిక్కర్ కేసులో గతేడాది ఫిబ్రవరి 26న సీబీఐ అరెస్టు చేయడంతో గత 17నెలలుగా జైలులో ఉన్నమాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. సీబీఐ అరెస్టు చేసిన రెండు రోజుల తర్వాత డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేసిన మనీశ్ సిసోడియాను ఆ తర్వాత ఈడీ కూడా కస్టడీలోకి తీసుకుంది. అప్పటి నుంచి గత 17 నెలలకు పైగా ఆయన జైల్లోనే ఉన్నారు. ఈ క్రమంలో బెయిల్ కోరుతు సుప్రీంకోర్టును ఆశ్రయించిన మనీశ్ సిసోడియాకు ఎట్టకేలకు ఊరటదక్కింది. మనీశ్ బెయిల్ పిటిషన్ విచారించిన జస్టిస్ బి.ఆర్ గవాయ్, జస్టిస్ కె.వి. విశ్వనాథన్ ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది.
ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. “ఏ నిందితుడిని కాలపరిమితి లేకుండా జైలులో ఉంచలేరని, కేసు విచారణలో పురోగతి లేకపోయినా.. ఒక పరిమితి దాటిన తర్వాత ఆ (వ్యక్తిని జైలులో ఉంచడం సరికాదని, అలాకాదంటే ఆ వ్యక్తి హక్కులను హరించడమే అవుతుందని వ్యాఖ్యానించింది. బెయిల్కు దరఖాస్తు చేసుకోవడం, ఉపశమనం పొందడం వారి హక్కు అని, ‘బెయిల్ అనేది నియమం.. జైలు మినహాయింపు’ అనే విషయాన్ని ట్రయల్ కోర్టులు, హైకోర్టులు గ్రహించాల్సిన సమయం ఆసన్నమైందని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో త్వరలోనే లిక్కర్ స్కామ్లోని మిగతా నిందితులకు కూడా బెయిల్ వచ్చే అవకాశముందని భావిస్తున్నారు.
ఆప్ శ్రేణుల సంబరాలు..ఆనందపడొద్దన్న బీజేపీ
మనీశ్ సిసోడియాకు బెయిల్ మంజూరు పట్ల ఆప్ శ్రేణుల్లో సంబరాలు వ్యక్తమయ్యాయి. గతంలో మనీశ్ సిసోడియా శంకుస్థాపన చేసిన ఓ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన అతిథి తన ప్రసంగంలో ఈ రోజు నిజం గెలిచిందని, ఢిల్లీ విద్యార్థులు గెలిచారని, పేద పిల్లలకు సిసోడియా మెరుగైన విద్యను అందించడం, వారికి ఉజ్వల భవిష్యత్తు కల్పించడం కొందరికి నచ్చలేదన్నారు. అందుకే తప్పుడు కేసులో జైలుకు పంపించారని, కానీ, ఇప్పుడు ఆయనకు న్యాయం జరిగింది” అని చెబుతూ ఉద్వేగానికి లోనై వేదికపైనే కంటనీరు పెట్టుకున్నారు.
సీఎం కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ ట్విటర్ వేదికగా సిసోడియా బెయిల్పై స్పందిస్తూ కొన్నిసార్లు న్యాయం అలస్యం కావొచ్చేమో.. కానీ అన్యాయం మాత్రం జరగదు’ అని పోస్ట్ చేశారు. ఈ రోజు నిజం గెలిచిందని, సుప్రీం బెయిల్ తీర్పు నియంతృత్వానికి చెంపదెబ్బ అని ఆప్ ఎంపీలు సంజయ్ సింగ్, రాఘవ్ చద్దాలు అభివర్ణించారు. బీజేపీ మాత్రం మనీశ్ సిసోడియా బెయిల్పై భిన్నంగా స్పందించింది. బెయిల్ వచ్చిందని మరీ ఆనందపడొద్దని, “కోర్టు తీర్పులను బీజేపీ గౌరవిస్తుందని,కానీ, బెయిల్ వచ్చినంతమాత్రాన.. కేసు నుంచి విముక్తి లభించినట్లు కాదని పేర్కోంది. ఇది తాత్కాలిక ఉపశమనం మాత్రమేనని, కేసు దర్యాప్తు జరుగుతోందని, సాక్ష్యాలు, నిజాలు బయటకు వస్తాయంటూ వ్యాఖ్యానించింది.
పిల్లలూ.. మీ మనీశ్ మామ తిరిగి వస్తున్నారు.. : ఎక్స్లో ఛద్దా
మనీశ్ సిసోడియాకు బెయిల్ వచ్చిన వార్తను ఆప్ ఎంపీ రాఘవ్ ఛద్దా ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ఢిల్లీ విద్యారంగ విప్లవానికి కథానాయకుడైన మనీశ్ సిసోడియాకు బెయిల్ రావడంతో యావత్ దేశం సంతోషంగా ఉన్నది. గౌరవనీయ సుప్రీంకోర్టుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’ అని ఆయన పేర్కొన్నారు. ‘మనీశ్జీ 530 రోజులుగా జైల్లో ఉన్నారు. పేద ప్రజల బిడ్డలకు మెరుగైన భవిష్యత్తును ఇవ్వడమే ఆయన చేసిన నేరం. ప్రియమైన పిల్లలారా.. మీ మనీశ్ మామ తిరిగి వస్తున్నారు’ అని ఛద్దా పేర్కొన్నారు. సిసోడియాకు బెయిల్ను డీఎంకే ఎంపీ కనిమొళి స్వాగతించారు. ‘ఎట్టకేలకు కొంత న్యాయం కనిపిస్తున్నది. ఇంకా చాలా జరగాల్సి ఉన్నది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఇంకా బెయిల్ రాలేదు. జైల్లోనే ఉంచాలని చట్టం చెప్పడం లేదు. ప్రతి ఒక్కరికీ బెయిల్ పొందే హక్కు ఉన్నది’ అని ఆమె అన్నారు. ఉపశమనం ఆలస్యమైనప్పటికీ.. సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా అన్నారు.
రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిని సుదీర్ఘకాలం 17 నెలల పాటు జైల్లో ఉంచాల్సిన అవసరమేంటో చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సీఎం కేజ్రీవాల్కు 20వరకు కస్టడీ పొడిగింపు
ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో సీబీఐ నమోదు చేసిన అవినీతి కేసుకు సంబంధించి సీఎం అరవింద్ కేజ్రీవాల్కు విధించిన జ్యుడీషియల్ కస్టడీని ఈ నెల 20 వరకు ప్రత్యేక న్యాయస్థానం పొడిగించింది. గురువారం ఆయన్ని వీడియో కాన్ఫరెన్సు ద్వారా హాజరుపరిచినప్పుడు న్యాయమూర్తి ఈ ఆదేశాలిచ్చారు. ఈ కేసులో కేజ్రీవాల్పై సీబీఐ దాఖలు చేసిన చార్జిషిట్ను న్యాయస్థానం ఈ నెల 12న పరిగణనలో తీసుకుని విచారించనుందని కేజ్రీవాల్ న్యాయవాదులు భావిస్తున్నారు.
కవిత కేసు 21కి వాయిదా
ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆరెస్ ఎమ్మెల్సీ కవిత కేసులో దాఖలైన సీబీఐ చార్జిషీట్ పై విచారణ మరోసారి వాయిదా పడింది. విచారణను ఈ నెల 21 కి వాయిదా వేస్తూ రౌజ్ అవెన్యూ ప్రత్యేక కోర్టు నిర్ణయం తీసుకుంది. నిందితుల తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తూ.. సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్ ను స్కూటినీ చేయాల్సి ఉంటుందని కోర్టుకు తెలిపారు. అంతేగాక చార్జిషీట్ లోని పేవర్లకు ఒకవైపు మాత్రమే పేజీ నంబర్ ఉందని, వాదనలు వినిపించేందుకు ఇబ్బందికరంగా ఉంటుందని కోర్టుకు వివరించారు. దీనిపై సీబీఐ ఈ నెల 14 వరకు పేజీనేషన్ సరి చేసి ఇస్తామని, అప్పటివరకు సమయం ఇవ్వాలని కోర్టుకు వాదనలు వినిపించింది. దీంతో చార్జిషీట్ పై తదుపరి విచారణను వాయిదా వేస్తున్నట్లు జస్టిస్ కావేరి భవేజా తెలిపారు.
ఈ మేరకు విచారణను ఆగస్టు 21వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు రౌజ్ అవెన్యూ ప్రత్యేక కోర్టు వాయిదా వేసింది. కాగా ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆరెస్ ఎమ్మెల్సీ కవితను ప్రధాన నిందితురాలుగా పేర్కొంటూ సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. లిక్కర్ స్కామ్లో ఈడీ, సీబీఐ కేసుల్లో మార్చి 15న అరెస్టయిన కవిత ప్రస్తుతం తీహార్ జైలులో జ్యూడీషియల్ కస్టడీలో ఉన్నారు. కాగా కవితను ములాఖత్లో కలిసి కేటీఆర్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ కవిత జైలులో చాల ఇబ్బంది పడుతున్నారని, ఆమె 11కిలోల బరువు తగ్గారని, అనారోగ్యంతో ఉన్నారని, బీపీ వచ్చిందని, రోజుకు రెండు మాత్రలు వేసుకుంటున్నారన్నారు. కవిత బెయిల్ ప్రాసెస్లో ఉందని, వచ్చే వారంలో బెయిల్ తప్పక వస్తుందని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.