Ponguleti Srinivas reddy । కేసీఆర్ మాదిరిగా విదేశీ కుట్ర అంటూ ఫార్మ్ హౌస్ లో కూర్చోలే..
కేటీఆర్ అమెరికాలో ఉండి, ఇక్కడ ఏమి జరుగుతుందో తెలియకుండా, అజ్ఞానంతో ఇష్టం వచ్చినట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆరోపించారు. ఆయన ఎందుకు అమెరికా వదిలి రావడం లేదు ? అని నిలదీశారు.

- చినుకు పడిన క్షణం నుంచి ప్రజల్లోనే ఉన్నాం
- మా ముందస్తు చర్యల వల్ల వీలైనంత ప్రాణ నష్టం తగ్గించగలిగాం
- పదేండ్లలో డిజాస్టర్ మేనేజ్ మెంట్ పూర్తిగా నిర్లక్ష్యం చేశారు
- విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు
- ప్రజల రక్షణే మాకు ముఖ్యం
- రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
Ponguleti Srinivas reddy । నాడు 2022 లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వచ్చిన భారీ వర్షాలు, వరదలు నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి వారి వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికి వర్షాలు క్లౌడ్-బరస్ట్, విదేశీ కుట్ర అంటూ మతిలేని ప్రకటనలు చేసిన బీఆర్ఎస్ నాయకులకు ఇప్పుడు తమ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక అర్హత ఎక్కడిదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు. విదేశీ కుట్ర అని ఫార్మ్ హౌస్ దాటని బీఆర్ఎస్ పార్టీ పెద్దలు ఈ రోజు వరదల గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ఆనాడు ప్రకృతిపరంగా కురిసిన వర్షాలను కూడా కుట్రకోణంలో చూసిన ఆ పెద్దమనిషి, ఆ దొరవారి అల్లుడు హరీష్ రావు కూడా ఇప్పుడు వచ్చిన వర్షాలను కుట్ర కోణంలోనే చూస్తున్నారా? అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
‘వరదల్లో కారు కొట్టుకుపోయి చనిపోయిన సైంటిస్టు నునావత్ అశ్విని కుటుంబాన్ని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో కలిసి క్యాబినెట్ సహచర మంత్రులం పరామర్శించి, భరోసా కల్పించాం. కనీసం చనిపోయిన కుటుంబాలను పరామర్శించాలన్న సోయి కూడా బీఆర్ఎస్ పెద్దలకు లేకపోవడం దురదృష్టకరం’ అన్నారు. వరద కష్టాల్లో ఉన్న ప్రజలను పరామర్శించడానికి గడప దాటని కేసీఆర్కు జైలు నుండి వచ్చిన బిడ్డను ఆశీర్వదించడానికి సమయం ఉంటుంది కానీ, వరద కష్టాల్లో ఉన్న ప్రజలను పరామర్శించడానికి లేదని పొంగులేటి అన్నారు. పదేండ్ల పాలన అనుభవంతో ప్రతిపక్ష నేత కేసీఆర్ ఒక సలహానైనా సూచననైనా చేస్తారని భావించామని, కానీ ఆయన పెదవి కూడా విప్పకపోవడం దురదృష్టకరమన్నారు. ఇంకా ఆయన కుమారుడు కేటీఆర్ అమెరికాలో ఉండి, ఇక్కడ ఏమి జరుగుతుందో తెలియకుండా, అజ్ఞానంతో ఇష్టం వచ్చినట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని ఆరోపించారు. ఆయన ఎందుకు అమెరికా వదిలి రావడం లేదు ? అధికార పార్టీని తిట్టడమే ప్రతిపక్ష పార్టీ పని అన్నట్టుగా మా మీద దాడి చేస్తున్నారన్నారు. ఓటు వేసిన వేలుకు సిరా చుక్క కూడా తొలిగిపోయిందో లేదో అప్పటినుంచే దాడి మొదలుపెట్టారు. పది సంవత్సరాలలో విపత్తుల నిర్వహణ (డిజాస్టర్ మేనేజ్మెంట్) విభాగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశాని ఆరోపించారు. ఒక్క నాడైనా ప్రకృతి విపత్తులమీద సమావేశం నిర్వహించారా ? దాన్ని బలోపేతం చేయాలన్న ఆలోచన చేశారా ? దాన్ని బలోపేతం చేసి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేదా? అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో, ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో ఒక్కసారిగా ఆకాశం నుంచి నీళ్ళు గుమ్మరించినట్టుగా, తక్కువ సమయంలో ఎక్కువ వర్షం కురవడంతో ఊహించని నష్టం వాటిల్లిందన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం ముందుజాగ్రత్తగా తీసుకున్న చర్యలు, వర్షం అనంతరం ప్రజలను రక్షించడంలో, వారికి కావలసిన వసతులు కల్పించి ఆదుకోవడంలో చూపిన చొరవ, అందించిన సహాయ సహకారాల కారణంగా అపారనష్టాన్ని తగ్గించగాలిగామని పొంగులేటి తెలిపారు. ముఖ్యంగా ఖమ్మంజిల్లాకు సంబంధించి నాతో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అందరం కలిసి సమన్వయంతో పని చేయడం వల్లే ప్రాణ నష్టాన్ని, కనిష్ట స్థాయికి తగ్గించగలిగామని తెలిపారు. ప్రజలను ఆదుకోవడానికి అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ, కోడి పిల్లలను కాపాడినట్టు జిల్లా ప్రజలను రక్షిస్తూ వచ్చామన్నారు. మరోవంక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఖమ్మం జిల్లాలో పర్యటించి, పరిస్థితిని పూర్తిస్థాయిలో అంచనా వేసేందుకు అక్కడే రాత్రిపూట బసచేసి మరీ ప్రజలను ఆదుకున్నారని తెలిపారు. గతంలో ఖమ్మం జిల్లాలో వరదలు వస్తే పదివేలు చొప్పున సహాయం చేస్తామని చెప్పి చేతులెత్తేసినవారు ఇప్పుడు యాభై వేలు ఇవ్వాలని డిమాండ్ చేయడం విచిత్రంగా ఉందని పొంగులేటి అన్నారు. ఇదంతా ఇంకా ప్రజలు మరచిపోలేదని, బీఆర్ఎస్ బురద రాజకీయాలను పట్టించుకోవడం లేదన్నారు.