హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో వేడి ఇంకా కొనసాగుతూనే ఉంది. నిన్నటి వరకు ఎన్నికల హడావుడి కనిపించగా, తాజాగా రాజకీయాల్లో సంచలనం సృష్టించే ఓ సన్నివేశం సోషల్ మీడియా కంట పడింది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతున్నారని, కాంగ్రెస్కు చెందిన ఎమ్మెల్యేలే బీఆర్ఎస్లో చేరుతున్నారని ఇరు పార్టీల నాయకులు బహిరంగంగా మాట్లాడుతున్న సంగతి తెలిసిందే.
అయితే రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి కేరళకు బయల్దేరారు. ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, జారే ఆదినారాయణ, పాయం వెంకటేశ్వర్లు మంత్రి పొంగులేటి వెంట ఉన్నారు. తెల్లం వెంకట్రావ్ సీటు వెనుకాలే బీఆర్ఎస్ నాయకుడు, తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కూడా ఉన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి పైలట్ రోహిత్ రెడ్డి వెళ్తున్నారా..? లేక విడిగా వెళ్తున్నారా..? అనే అంశంపై స్పష్టత లేదు. కానీ వారి వెనుకాల సీట్లోనే పైలట్ రోహిత్ రెడ్డి దర్శనమివ్వడంతో తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ ఏదో జరుగుతుందని జోరుగా చర్చ కొనసాగుతోంది. విమానంలో వారు ఉన్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. ఇదే రోహిత్ రెడ్డి ఫామ్ హౌజ్లో బీజేపీ సీనియర్ నేత బీఎల్ సంతోష్.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి జరిపిన చర్చల్లో అడ్డంగా దొరికిపోయిన విషయం విదితమే. పైలట్ రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్ రెడ్డి, రేగా కాంతరావు ఆ ఫామ్ హౌజ్లో కనిపించారు. ఈ అంశం అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
పొంగులేటితో కేరళకు ప్రయాణం అయిన ఖమ్మం ఎమ్మెల్యేలు..
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో ఖమ్మం ఎమ్మెల్యేలు హైదరాబాద్ నుండి కొచ్చిన్కు ప్రయాణం అయ్యారు.
పొంగులేటితో ఖమ్మం ఎమ్మెల్యేలు,
తాండూర్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కూడా అదే విమానంలో ఉండడంతో ఏదో జరుగుతుంది అని చర్చ… pic.twitter.com/thSuXckaa9— Telugu Scribe (@TeluguScribe) May 14, 2024