పనికిరాని మొక్కలు నాటి ప్రజాధనం వృధా చేశారు: మంత్రి పొన్నం
పిట్టలు గూళ్లు పెట్టలేని మొక్కలు నాటి గత ప్రభుత్వం కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని వృథా చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు.

బీఆరెస్ ప్రభుత్వంపై మంత్రి పొన్నం విమర్శలు
విధాత, హైదరాబాద్ : పిట్టలు గూళ్లు పెట్టలేని మొక్కలు నాటి గత ప్రభుత్వం కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని వృథా చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. జీహెచ్ఎంసీ పరిధిలో 30లక్షల మొక్కలు నాటే వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా సోమవారం 56ప్రాంతాల్లో 7,134మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్ రామాంతపూర్ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో మొక్క నాటారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాలుష్యం పెరిగితే భవిష్యత్ తరం మనల్ని క్షమించదన్నారు. మొక్కలు నాటడం ప్రభుత్వ బాధ్యతే అని కాకుండా ప్రజలు కూడా తమ భాగస్వామ్యాన్ని, పర్యావరణ బాధ్యతను గుర్తెరిగి మొక్కలు నాటాలని కోరారు. 30 సర్కిళ్లలో ఇవాళ 7000 పైగా మొక్కలు నాటనున్నట్లు మేయర్ విజయలక్ష్మి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, కార్పోరేటర్లు, అధికారులు పాల్గొన్నారు.