Ponnam Prabhakar : రక్షణశాఖ భూములను రాష్ట్రప్రభుత్వానికి అప్పగించాలి
రక్షణ శాఖ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ రక్షణశాఖ మంత్రికి లేఖ రాశారు. భూమి మార్పిడి వేగవంతం కోరారు.

హైదరాబాద్, అక్టోబర్ 03(విధాత): రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్కు హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖ రాశారు. జీహెచ్ ఎంసీ మేయర్ గద్వాల విజయ లక్ష్మీ, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ సంతకాలతో కూడిన లేఖను పంపారు.
హైదరాబాద్లోని కొన్ని రక్షణ భూములను కీలకమైన ప్రజా ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి విడిచిపెట్టడానికి సానుకూలంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటారని రక్షణ మంత్రిత్వ శాఖకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని మంత్రి పొన్నం లేఖలో వెల్లడించారు.
రోజురోజుకు అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్, సికింద్రాబాద్ లో నివసిస్తున్న ప్రజలకు కీలకమైన మౌలిక సదుపాయాల అవసరాలను తీర్చడంలో, పౌర సౌకర్యాలను మెరుగుపరచడంలో రక్షణ శాఖ భూములు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
కంటోన్మెంట్ నుంచి తెలంగాణ ప్రభుత్వానికి యూజర్ ఛార్జీల భాగం కింద దాదాపు రూ.1,000 కోట్లు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. ఈ బకాయిలను సకాలంలో క్లియరెన్స్ చేయడం వలన రక్షణ శాఖ పరిధిలో అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలలో ప్రజా మౌలిక సదుపాయాలు కల్పించడం వారికి అవసరమైన పౌర సేవలు కొనసాగించడంలో రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు లభిస్తుందన్నారు.
ప్రజా వినియోగం కోసం కొన్ని రక్షణ భూములను ఇవ్వడానికి అంగీకరించినందుకు భారత ప్రభుత్వానికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని, అయితే ఈ భూములను అప్పగించే ప్రక్రియను వేగవంతం చేయాలని మీకు అభ్యర్థిస్తున్నానన్నారు.
నగర అభివృద్ధికి, ప్రజా సౌకర్యానికి అధిక ప్రాముఖ్యత కలిగిన కొనసాగుతున్న మౌలిక సదుపాయాలు , మొబిలిటీ ప్రాజెక్టులను అమలు చేయడానికి ఈ భూమార్పిడి కీలకం, గత కొన్ని సంవత్సరాలుగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు జరగడం లేదని మీ దృష్టికి తీసుకువస్తున్నామన్నారు.
ప్రజాస్వామ్య పాలన, స్థానిక ప్రాతినిధ్యం దృష్ట్యా, ఈ ఎన్నికలను వీలైనంత త్వరగా నిర్వహించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అభ్యర్థిస్తున్నామని లేఖలో తెలిపారు.హైదరాబాద్ అభివృద్ధికి కీలకమైన ఈ అంశాలపై రక్షణ మంత్రిత్వ శాఖ తగిన పరిశీలన చేస్తుందని విశ్వసిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖలో పేర్కొన్నారు.