Seethakka : పౌష్టికాహార లోపం లేని తెలంగాణను నిర్మించడమే లక్ష్యం : మంత్రి సీతక్క

ములుగులో ప్రీ స్కూల్ చిన్నారులకు ప్రతిరోజు 100 మి.లీ పాలను అందించే పైలట్ ప్రాజెక్ట్‌ను మంత్రి సీతక్క ప్రారంభించారు. పోషకాహార లోప నిర్మూలన లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టారు.

seethakka

విధాత, హైదరాబాద్ : తెలంగాణలో తొలిసారిగా చేపట్టిన ప్రీ స్కూల్ చిన్నారులకు 100 మి.లీ పాలను ప్రతిరోజు అందించే కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టుగా ములుగు జిల్లా కేంద్రంలోని కృష్ణా కాలనీ అంగన్‌వాడీ కేంద్రంలో మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాష్ట్రంలోని పోషకాహార లోపాన్ని అధిగమించి తెలంగాణను పోషకాహార లోప రహిత రాష్ట్రంగా మార్చడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నదన్నారు. ఇందులో భాగంగానే ఎక్కువగా వెనకబడిన ప్రాంతంగా ఉన్న ములుగు జిల్లాను ఈ కార్యక్రమానికి పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమం విజయవంతానికి అంగన్‌వాడీ టీచర్లు క్రియాశీల పాత్ర వహించాలని సూచించారు. ముఖ్యంగా తల్లితండ్రులను కలిసి అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న సేవలను వివరించాలని సూచించారు. అలాగే కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా మన అంగన్‌వాడీ కేంద్రాలు పనిచేసేలా అంగన్‌వాడీలు అంకితభావంతో కృషి చేయాలని సూచించారు.

అనంతరం వయోవృద్ధుల వారోత్సవాలతో పాటు, బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా పోస్టర్లు ఆవిష్కరించి మాట్లాడారు. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసిన పిల్లల నుంచి వారి ఆస్తులను జప్తుచేసి తల్లిదండ్రుల మీద మార్పిడి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. బాల్యవివాహాలు పిల్లల అభివృద్ధికి విఘాతం అన్నారు. బాల్య వివాహాలను అడ్డుకుని ములుగును బాల్యవివాహాల రహిత జిల్లా‌గా తీర్చిదిద్దాలని సూచించారు. ఈ విషయంలో సీడీపీవో‌లు, పర్‌వైజర్లు, అంగన్‌వాడీ టీచర్లు &ఇతర ఎంత కృషిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో చిత్రామిశ్రా, అదనపు కలెక్టర్ మహేందర్ జీ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచంద్ర, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి, ములుగు ఆత్మ చైర్మన్, వివిధ ఐసీడీఎస్ ప్రాజెక్ సీడీపీవోలు, డీసీపీవో ఓంకార్, డీఎంసీ రమాదేవి, ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు, అంగన్‌వాడీ టీచర్లు, తదితర విభాగాల సిబ్బంది మరియు చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.