Site icon vidhaatha

Sitarama project | ఖమ్మం జిల్లా వరదాయిని సీతారామ ప్రాజెక్టు: మంత్రి ఉత్తమ్‌

15న సీఎం రేవంత్‌రెడ్డితో ప్రారంభోత్సవం
ట్రయల్ రన్ విజయవంతంపై హర్షం
ఏటా 6లక్షల ఎకరాలకు సాగునీరు లక్ష్యం
రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
దోపిడి లక్ష్యంతోనే రీడిజైన్ చేసిన కేసీఆర్ ప్రభుత్వం : పొంగులేటి
నెరవేరనున్న గోదావరి జలాల సరఫరా కల : తుమ్మల

విధాత, హైదరాబాద్ : ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతాంగానికి వరదాయిని సీతారామ ప్రాజెక్టు అని, ఈ ప్రాజెక్టును ఈ నెల 15న సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించుకోబోతున్నామని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఆదివారం సీతారామ ప్రాజెక్ట్ పూసుగూడెం ట్రయల్ రన్ ను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రారంభించారు. అనంతరం పుసుగూడెం, కమలాపురం పంపుహౌస్‌లను మంత్రులు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రులు మీడియాతో మాట్లాడారు. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ సీతారామ ప్రాజెక్ట్ 3 పంపు హౌస్‌లు ప్రారంభానికి సిద్ధంగా వున్నట్లు తెలిపారు. పూసుగూడెం పంప్‌హౌజ్ ట్రయల్ రన్ విజయవంతమైందని, ఈ రోజు చరిత్రలో నిలిచిపోతుందన్నారు.

సీతారామ ప్రాజెక్టు 2,3లిఫ్ట్ ఇరిగేషన్‌ పంప్ హౌజ్‌లను సీఎం రేవంత్‌రెడ్డి ఆగస్టు 15న ఖమ్మం జిల్లా వైరాలో భారీ బహిరంగ సభలో ప్రారంభిస్తారని తెలిపారు. అదే సభలో రైతుల 2లక్షల రుణమాఫీ ప్రకటన చేస్తారని పేర్కోన్నారు. ఏటా 6లక్షల ఎకరాలకు సాగునీరివ్వాలన్న సంకల్పంతో తమ ప్రభుత్వం ముందుకెలుతుందన్నారు. 2026ఆగస్టు 15నాటికి ప్రతి ఎకరాకు నీరందించే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకి గత ప్రభుత్వ హయంలో ఎలాంటి అనుమతులు లేవని, నీటి కేటాయింపులు లేవని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సెంట్రల్ వాటర్ కమిషన్‌ని, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి సీతారామకు అన్ని రకాల అనుమతులు తీసుకున్నామని మంత్రి వెల్లడించారు. 67 టీఎంసీల గోదావరి జలాలు సీతారామకు కేటాయించేలా కృషి చేశామని వివరించారు.

‘‘ఏన్కూరు లింకు కెనాల్‌కు రాజీవ్ కెనాల్‌గా నామకరణం చేసి శరవేగంగా పనులు పూర్తి చేశామని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం రూ.8,000 కోట్లు సీతారామ ప్రాజక్ట్‌కు ఖర్చుచేసి కనీసం పంపులు ఏర్పాటు చేయలేదని, సీతారామ పరిధిలో ఒక్క ఎకరాకు నీరు ఇవ్వలేదని విమర్శించారు. 15 ఆగస్ట్ 2026 నాటికి సీతారామ ప్రాజక్ట్ పూర్తి చేసి పూర్తి స్థాయిలో వినియోగానికి తీసుకొస్తామని, సీతారామకు సంబంధించి 1,658 ఎకరాల భూసేకరణ చేయాల్సిన అవసరం ఉందని, జిల్లా ప్రజలు సహకరిస్తే భూసేకరణ సేకరణ పూర్తి చేసి ప్రాజక్ట్ పూర్తి చేస్తామన్నారు. రెండు సంవత్సరాలలో సీతారామను పూర్తి చేసి పది లక్షల ఎకరాల ఆయకట్టుకు గోదావరి జలాలను అందిస్తామని తెలిపారు. ఆగస్టు 15న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏన్కూర్ లింక్ కెనాల్ ప్రారంభిస్తారని, ఆగస్టు 15న 2 లక్షల రుణమాఫీని పూర్తి చేస్తామని ఉత్తమ్ వెల్లడించారు.

కేసీఆర్ ప్రభుత్వం ప్రాజెక్టు రీడిజైన్ పేరుతో వేలకోట్ల దోపిడి: పొంగులేటి

ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతాంగం చిరకాల వాంఛ ఈనెల 15న నెరవేరబోతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గోదావరి నీటిని కృష్ణా పరీవాహక ప్రాంతానికి తీసుకొచ్చే సీతారామ ప్రాజెక్ట్‌ను ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించబోతున్నారని ప్రకటించారు.గోదావరి జలాలను కృష్ణా జలాలను అనుసంధానం చేయనున్నామన్నారు. రూ.2,400 కోట్లతో ప్రతిపాదించిన రాజీవ్‌సాగర్ ఇందిరా సాగర్ ప్రాజెక్టునుకే సీఆర్ ప్రభుత్వం రీడిజైన్ పేరుతో రూ.18,000 కోట్లకు పెంచి దోచుకున్నారన్నారు. రేవంత్ ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టు పనులు యుద్ధప్రాతిపదికన చేయించి పూర్తి చేస్తోందని, అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు తీసుకువచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని, రాజీవ్ కెనాల్ ద్వారా లక్షల ఎకరాలకు సాగునీరు అందించబోతున్నామన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు సీతారామ ప్రాజెక్టును పూర్తి చేసి రైతాంగానికి అప్పజెప్పుతున్నామన్నారు.

కేంద్రంతో మాట్లాడి కేంద్ర మంత్రులను ఒప్పించి సీతారామకు 67 టీఎంసీల నీటిని కేటాయిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం జీవో విడుదల చేయించిందని, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కృషి ఫలితంగా సీతారామకు గోదావరి జలాల కేటాయింపు జరిగిందన్నారు. ఎన్నికల సమయంలో ప్రకటించిన ఆరు గ్యారంటీలలో 5 గ్యారంటీలు ఇప్పటికే అమలు చేశామని, ఆగస్ట్ 15న ముఖ్య మంత్రి రేవంత్ రెండు లక్షల రుణమాఫీ పూర్తి చేస్తారని చెప్పారు. ధరణి పేరుతో కేసీఆర్ ప్రభుత్వం పేదల భూములు దోచుకుందని, రెవెన్యూ చట్టాన్ని సవరించి కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చి ప్రజల ముందు ఉంచామని, త్వరలోనే అర్హులైన వారందరికీ కొత్త రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు అందజేస్తామన్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆ కష్టాలు సమస్యలు అన్నింటిని అధిగమించి తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని చెప్పారు.

సీతారామం ప్రారంభోత్సవంతో నెరవెరనున్న కల : మంత్రి తుమ్మల

సీతారామం ప్రాజెక్టు ప్రారంభోత్సం రోజు ఎంతో సంతోషకరమైన రోజని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. ఆగస్ట్ 15న సీతారామ ప్రాజెక్ట్ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం అవుతుందని, జిల్లా ప్రజలకు గోదావరి జలాలు అందించాలన్న కల నెరవెరబోతుందన్నారు. ఇందిరా సాగర్ భూభాగం ఆంధ్రా లో కలవడం రాజీవ్ సాగర్ అటవీ ప్రాంతం సమస్యలు వల్ల సీతారామ ప్రాజెక్ట్ కు రూపకల్పన జరిగిందన్నారు. గత ప్రభుత్వంలో ప్రాజెక్ట్ పనులు నత్తనడకన సాగాయన్నారు. పంప్ హౌస్ ల పరిధిలో డిస్ట్రిబ్యూటరీ కాలువలు త్వరిత గతిన పూర్తి చేయాలన్నారు. కృష్ణా జలాలు సకాలంలో రాకపోతే ప్రత్యామ్నాయంగా తక్కువ ఖర్చుతో వైరా లింక్ కెనాల్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సత్తుపల్లి ట్రంక్ పనుల్లో యాతాలకుంట టన్నెల్ పూర్తి చేయాలన్నారు. జూలూరుపాడు టన్నెల్ పనులు పూర్తయితే పాలేరు వరకు గోదావరి జలాలు చేరతాయన్నారు.

Exit mobile version