లైంగిక దాడి, హత్యకు గురైన ఆరేళ్ల బాలిక కుటుంబాన్ని రాష్ట్ర మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, సీతక్క, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యేలు విజయ రమణారావు, మక్కాని సింగ్లతో కలిసి ఆదివారం పరామర్శించారు
నేరాల నివారణకు కఠిన చర్యలు
మత్తు పదార్ధాలతో పెరుగుతున్న నేరాలు
మంత్రులు శ్రీధర్బాబు, సీతక్కలు
విధాత, హైదరాబాద్ : లైంగిక దాడి, హత్యకు గురైన ఆరేళ్ల బాలిక కుటుంబాన్ని రాష్ట్ర మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, సీతక్క, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యేలు విజయ రమణారావు, మక్కాని సింగ్లతో కలిసి ఆదివారం పరామర్శించారు. ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. నిందితుడిని అరెస్టు చేశారు. సంఘటన జరిగిన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి రైస్ మిల్లో ఘటన స్థలాన్ని మంత్రుల బృందం పరిశీలించింది. సంఘటన పూర్వాపరాలను రామగుండి సీపీ శ్రీనివాస్ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని మంత్రులు హామీ ఇచ్చారు. ఆరేళ్ల చిన్నారిపై లైంగిక దాడి ఆపై హత్య ఘటన దురదృష్టకరమన్నారు.
తల్లిదండ్రుల వద్ద నిద్రిస్తున్న చిన్నారిపై బీహార్ కు చెందిన వ్యక్తి లైంగిక దాడికి పాల్పడడంతో పాటు కిరాతకంగా హత్య చేయడం సభ్య సమాజం క్షమించదన్నారు. సంఘటన సమాచారం అందగానే పోలీసులు స్పందించి గంట వ్యవధిలోని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారని అయితే అప్పటికే చిన్నారి మృతి చెందడం బాధాకరమన్నారు. సంఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి నిందితుడిని వెంటనే పట్టుకోవడంతోపాటు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపేలా ఆదేశించారన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు చర్యలు చేపట్టాలన్నారు. నేరాల నివారణకు మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
పెద్దపల్లి హత్యాచార ఘటన సహా అనేక నేరాలకు గంజాయి, డ్రగ్స్ వాడకమే ప్రధాన కారణమని మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు. మత్తుకు అలవాటు పడి వావి వరస అనే తేడా లేకుండా ఇలాంటి ఘాతుకాలకు పాల్పడుతున్నారని మంత్రి తెలిపారు. తల్లిదండ్రుల మధ్య పడుకున్న చిన్నారిని ఎత్తుకెళ్లి లైంగికదాడి చేసి హత్య చేసిన ఘటన చాలా బాధాకరమన్నారు. ఈ ఘటన పై ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుందన్నారు. రాత్రి వేళలో పోలీసులు గస్తీ పెంచాలని సూచించారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా అన్ని విధాల ఆదుకుంటామన్నారు. గంజాయి, డ్రగ్స్ పై ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతోందని మంత్రి సీతక్క తెలిపారు.