విధాత, హైదరాబాద్ : తెలంగాణలో బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రాజకీయ రిజర్వేషన్లతో పాటు విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులకు రాష్ట్ర అసెంబ్లీ, కౌన్సిల్ ఆమోదం తెలిపి 6 నెలలు గడిచిందని..ఈ రెండు బిల్లులు రాష్ట్రపతి ఆమోదానికి నోచుకోలేదని.. ఈ బిల్లులకు చట్టబద్ధత కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చిన్న ప్రయత్నం కూడా చేయలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత విమర్శించారు.
2018 పంచాయతీ రాజ్ చట్టానికి సవరణ చేసి బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించే సవరణ బిల్లు గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉందని..అసెంబ్లీ, కౌన్సిల్ ఆమోదించిన బిల్లులు రాష్టప్రతి వద్ద, చట్ట సవరణ బిల్లు గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉండగానే కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన జీవో నం.9 పై హైకోర్టు స్టే విధించిందని గుర్తు చేశారు.
హైకోర్టు ఉత్తర్వుల కాపీ నాకు ఈరోజు ఉదయం 8.30 గంటల ప్రాంతంలో అందిందని.. అసెంబ్లీ, కౌన్సిల్ ఆమోదించిన బిల్లులను ఆరు నెలలుగా కోల్డ్ స్టోరేజీలో పెట్టిన కేంద్ర ప్రభుత్వంపై, రాష్ట్రపతిపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించి న్యాయ పోరాటం చేయాలని కవిత సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఈ విషయంలో ఆలస్యం అయ్యింది.. ఇకనైనా సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని డిమాండ్ చేస్తున్నానన్నారు.