సైకిల్ ట్రాక్‌లో గేదెల పరేడ్‌.. పరేషాన్‌లో స్లైకిస్టులు

  • Publish Date - October 7, 2023 / 01:48 PM IST

విధాత: హైద్రాబాద్ అవుటర్ రింగ్ రోడ్డును ఆనుకుని నూతనంగా నిర్మించిన 23కిలో మీటర్ల సోలార్ రూఫ్‌ సైకిల్ ట్రాక్‌లో గేదెల బారులు కనిపించడం స్లైకిస్టులను అవాక్కయ్యేలా చేసింది. ఆక్టోబర్ 1న ఈ సైకిల్ ట్రాక్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ తరహా సైకిల్ ట్రాక్ దేశంలోనే మొదటిదన్నారు. దక్షిణ కోరియాలోని ప్రఖ్యాత సైకిల్ ట్రాక్‌ను ఆధ్యయనం చేసి ఈ సైకిల్ ట్రాక్ ఏర్పాటు చేశామని, దీనిపై ఉన్న సౌర పై కప్పుతో 16మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుందంటూ గొప్పగా చెప్పారు. తీరా చూస్తే ఈ సైకిల్ ట్రాక్‌లో గేదెలు బారులుగా సాగుతున్న దృశ్యాలు సాక్షాత్కరించాయి.

ఇది చూసిన నెటిజన్లు ఈ తరహా సైకిల్ ట్రాక్ నిజంగా దేశంలోనే మొదటిదంటూ వ్యంగ్యంగా కామెంట్లు పెడుతున్నారు. 100కోట్లతో నిర్మించిన ఈ సైకిల్ ట్రాక్ గేదెల ట్రాక్‌గా మారడం విమర్శల పాలవుతుంది. కాగా ఈ సైకిల్ ట్రాక్ ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి కేటీఆర్‌ త్వరలోనే నానక్‌రాంగూడ, ఫైనాన్షియల్ జిల్లా , కోకాపేట, నియోపోలీస్ , బుద్వేల్‌లోనూ సైకిల్ లైన్లు నిర్మిస్తామని, గండిపేట జలాశయం చుట్టు 46కిలో మీటర్లు సైకిల్ ట్రాక్ ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. అయితే ముందుగా ఉన్న సైకిల్ ట్రాక్ నిర్వాహణను సక్రమంగా కొనసాగించేందుకు చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.