5.10కోట్ల విలువైన 2043కిలోల గంజాయి దగ్ధం

డిస్ట్రిక్ట్ డ్రగ్ డిస్పోజల్ కమిటీ అధ్వర్యంలో కోర్టు ఉత్తర్వులు ప్రకారం సీజ్ చేసిన 5 కోట్ల 10 లక్షల 75 వేల విలువైన 2043కిలోల గంజాయిని దగ్ధం చేసినట్లుగా నల్లగొండ జిల్లా ఎస్పీ చందనా దీప్తి వెల్లడించారు.

  • Publish Date - April 26, 2024 / 05:20 PM IST

నల్లగొండ ఎస్పీ చందనా దీప్తి వెల్లడి

విధాత, హైదరాబాద్‌ : డిస్ట్రిక్ట్ డ్రగ్ డిస్పోజల్ కమిటీ అధ్వర్యంలో కోర్టు ఉత్తర్వులు ప్రకారం సీజ్ చేసిన 5 కోట్ల 10 లక్షల 75 వేల విలువైన 2043కిలోల గంజాయిని దగ్ధం చేసినట్లుగా నల్లగొండ జిల్లా ఎస్పీ చందనా దీప్తి వెల్లడించారు. మాదక ద్రవ్యాల నిర్ములనే లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా అక్రమ గంజాయి రవాణాపైన జిల్లా పోలీసులు నిరంతర నిఘా పెడుతు ఉక్కుపాదం మోపడంతో జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్‌ల పరిధిలలో 39 కేసులలో 2043కేజీల గంజాయిని సీజ్ చేశామన్నారు. పట్టుబడిన గంజాయిని కోర్టు ఉత్తర్వుల ప్రకారం నిర్మానుష్యంగా జనావాసానికి దూరంగా నార్కట్ పల్లి మండలం గుమ్మల బావి పోలీస్ ఫైరింగ్ రేంజ్ ప్రాంతంలో దగ్ధం చేసినట్లుగా తెలిపారు.

ఈ సందర్భంగా ఎస్పీ చందనాదీప్తి మాట్లాడుతూ జిల్లా పరిధిలో అక్రమ గంజాయి, డ్రగ్స్ రవాణా మరియు వినియోగం అరికట్టడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుని రవాణాదారులపై కఠిన చర్యలు తీసుకుని శిక్షలు పడేలా చేశామన్నారు. యువత డ్రగ్స్ వినియోగానికి దూరంగా ఉండాలని,తెలిసి తెలియక మత్తు పదార్థాల బారిన పడడంతో వారి బంగారు భవిష్యత్తు నాశనం అవుతోందని హెచ్చరించారు. నిషేధిత డ్రగ్స్ వాడడం వల్ల ఎన్నో రోడ్డు ప్రమాదాలు,ఇతర నేరాలకు పాల్పడుతూ కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయని పేర్కొన్నారు.

మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాల పట్ల కళాశాలల్లో పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లల జీవితం నాశనం చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. యువత చెడు వ్యసనాలకు అలవాటు పడి జీవితాలు నాశనం చేసుకోవద్దని, ఎవరైనా అక్రమ గంజాయి రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ఎవరైన గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలను సరఫరా చేస్తున్నట్లు సమాచారం తెలిస్తే, టోల్ ఫ్రీ నంబర్ 8712671111 కి సమాచారం తెలపాలని కోరారు.

Latest News