విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: టీఎస్పీఎస్సీపై రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్ల విద్యార్థి, యువజనులు తీవ్ర నిరాశలో కూరుకుపోయారని హన్మకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. టీఎస్పీఎస్సీ నిర్లక్ష్యంపై అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో శనివారం కలెక్టర్కు వినతిపత్రం ఇవ్వడానికి వెళుతుండగా పోలీసులు అడ్డుకున్నారు.
దీంతో వినతిపత్రాన్ని గేటుకు పెట్టారు. అనంతరం నాయిని మాట్లాడుతూ ప్రజలందరూ విద్యార్థులు, యువతకు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. ప్రస్తుత బోర్డు చైర్మన్ తో సహా టీఎస్పీఎస్సీ సభ్యులను తొలగించి ప్రక్షాళన చేయాలన్నారు. అసెంబ్లీలో ప్రకటించిన విధంగా ఉపాధ్యాయ పోస్టులు 13,500కు పెంచాలని కోరారు.
పరీక్షల రద్దుకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ బాధ్యత వహించి, పరీక్షలు రాసిన అభ్యర్థులకు రూ.3 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పరకాల నియోజకవర్గ బాధ్యులు ఇనగాల వెంకట్రామిరెడ్డి, అఖిలపక్ష నాయకులు అప్పారావు, మేకల రవి, కర్రె బిక్షపతి, టీడీపీ, బీఎస్పీ, సీపీఎం పార్టీల నాయకులు నాయిని లక్ష్మా రెడ్డి, రహీమున్నిస్సా బేగం, రాహుల్ రెడ్డి, పల్లకొండ సతీష్ పాల్గొన్నారు.