విధాత బ్యూరో, ఉమ్మడి నల్గొండ: ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్. నేరేడుచర్ల ఆపార్టీ పట్టణ అధ్యక్షురాలు, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ శ్రీలత రెడ్డి గుడ్ బై చెప్పారు. ఆమె పార్టీ పదవులకు, సభ్యత్వానికి రాజీనామా చేశారు. మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ గా తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు బుధవారం మున్సిపల్ కమిషనర్ కు రాజీనామా పత్రాన్ని అందజేశారు.
పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా పత్రాన్ని సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ కు పంపించారు. మరో పది రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ రానున్న తరుణంలో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా బీఆరెస్ పరిణామాలు ఆసక్తిగా మారుతున్నాయి. ఎమ్మెల్యేలపై ప్రజలు, ఆపార్టీ నాయకులు, కార్యకర్తల్లో సైతం తీవ్ర వ్యతిరేకత నెలకొందన్న ప్రచారం సాగుతోంది.
హుజూర్నగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి రాచరిక పాలన కొనసాగిస్తున్నారని ఆపార్టీ నాయకులు బహిరంగంగా విమర్శిస్తున్నారు. ఎమ్మెల్యే ఒంటెద్దు పోకడలు మితిమీరడంతోనే నేరేడుచర్ల పట్టణ అధ్యక్షురాలు, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ చల్లా శ్రీలత రెడ్డి రాజీనామా చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఈ అంశం నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది. ఆమె బాటలో చాలామంది నాయకులు రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ నేతలు కొందరు తెలంగాణ, ఆంధ్ర సరిహద్దు ప్రాంతంలో సమావేశమైనట్లు సమాచారం. త్వరలోనే సర్పంచులు, ఎంపీపీ, ఎంపీటీసీలు చాలామంది రాజీనామాలు చేయనున్నట్లు తెలిసింది.
త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తా
నేరేడుచర్ల పట్టణంలో బీఆరెస్ అధ్యక్షురాలిగా, కౌన్సిలర్ గా సుధీర్ఘకాలం పనిచేశానని మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ శ్రీలత రెడ్డి తెలిపారు. పార్టీ అభివృద్ధి కోసం ఎంతో పని చేశానన్నారు. స్థానిక ఎమ్మెల్యే సైదిరెడ్డి విధానాలు నచ్చక రాజీనామా చేసినట్లు ఆమె మీడియాకు వెల్లడించారు.
ఎమ్మెల్యే అరాచక పాలన నచ్చని ఎంతోమంది తన అనుచరులు రాజీనామాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. త్వరలోనే వారు కూడా రాజీనామా చేస్తారని చెప్పారు. సైదిరెడ్డి లాంటి నాయకులు రాచరిక పాలన కొనసాగిస్తుంటే చూస్తూ సహించమని హెచ్చరించారు. త్వరలోనే రాజకీయ భవిష్యత్ ప్రణాళిక ప్రకటిస్తానని ఆమె వెల్లడించారు.