ప్రజా ప్రభుత్వాన్ని కూల్చడం ఎవరి తరం కాదు

రాష్ట్రంలో ఉన్నది ప్రజా ప్రభుత్వం ఎవరో కూలగొడితే కూలిపోయే ప్రభుత్వం కాదు ప్రజలు మాకు ఎన్నిరోజులు అవకాశమిస్తే అన్ని రోజులు అధికారంలో ఉంటామని

  • Publish Date - January 24, 2024 / 03:24 PM IST

– 64 మంది ఎమ్మెల్యేలు ఒక్క తాటిపై ఉన్నారు

– కరీంనగర్ లాంటి నగరాలకు కూడా హెచ్ సీఎల్

కంపెనీలు తీసుకువచ్చి ఐటీ రంగాన్ని అభివృద్ధి చేస్తాం

– దావోస్ పెట్టుబడులపై బీఆర్ఎస్ నాయకుల మాటలు అర్థరహితం

– ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

విధాత బ్యూరో, కరీంనగర్: రాష్ట్రంలో ఉన్నది ప్రజా ప్రభుత్వం.. ఎవరో కూలగొడితే కూలిపోయే ప్రభుత్వం కాదు.. ప్రజలు మాకు ఎన్నిరోజులు అవకాశమిస్తే అన్ని రోజులు అధికారంలో ఉంటామని ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. 64 మంది ఎమ్మెల్యేలు ఒక్క తాటిపై ఉన్నామని స్పష్టం చేశారు. హైదరాబాద్‌ నుంచి ధర్మపురి వెళ్తున్నక్రమంలో కరీంనగర్ లో కొంతసేపు ఆగి మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వాలు చేసిన మంచిని కొనసాగిస్తాం… దావోస్ లో వచ్చిన పెట్టుబడులపై బీఆర్ఎస్ వ్యాఖ్యలు అర్థరహితమని విమర్శించారు. ప్రజా శ్రేయస్సు, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వాలు కొన్ని పనులను కొనసాగిస్తుంటాయి.. అలాగని ఆ పని మేమే చేశామని బీఆర్ఎస్ చెప్పుకుంటే అవివేకమౌతుందని శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు.

– ఐటీని బలోపేతం చేస్తాం

జిల్లాకేంద్రాల్లో ఐటీ టవర్‌ నిర్మించినా.. అనుకున్న మేరకు సాఫ్ట్వేర్‌ కంపెనీలు ఎందుకు రావడం లేదో అధ్యయనం చేసి ప్రోత్సహించేందుకు తగుచర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. ఐటీ టవర్లు నిర్మించినంత మాత్రాన ఐటీ వృద్ధి జరగదని.. వాటిని బలోపేతం చేసేందుకు యత్నిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఐటీ రంగం హైదరాబాద్‌ తో పాటు జిల్లా కేంద్రాలకు మాత్రమే పరిమితం కాకూడదని త్రీటయర్‌ పట్టణాలకు కూడా విస్తరిస్తామన్నారు. అక్కడ మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. భాజపా, భారాసలు తమ ఉనికి కాపాడుకోవడానికే ఆరాటపడుతున్నాయని.. పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. నిన్న కేవలం మ్యానిఫెస్టో ఇచ్చిన హామీలు ఏమేరకు అమలు అవుతున్నాయి… రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై మాత్రమే సమీక్ష జరిగిందన్నారు. గత ప్రభుత్వాలు అమలు చేసిన పథకాల్లో మంచి విషయాలను తప్పకుండా పరిగణలోకి తీసుకుంటామన్నారు. మేడిగడ్డ నాణ్యత ప్రమాణాల విషయంలో ప్రజలకు వాస్తవాలు తెలియడమే కాకుండా దానికి సంబంధించిన నివేదికను కూడా ప్రభుత్వం రూపొందిస్తుందని అన్నారు. కరీంనగర్ లో ఐటీ ని బలోపేతం చేసేందుకు హెచ్ సీ ఎల్ లాంటి పెద్ద సంస్థలను ఆహ్వానిస్తున్నామని అన్నారు. కాగా అంతకు ముందు బైపాస్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రికి స్వాగతం పలికారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానులు శాలువాలు, పూలమాలలతో శ్రీధర్ బాబును సత్కరించారు.

Latest News