డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క: ఓఆర్ఆర్ వెలుపలికి కాలుష్యకారక పరిశ్రమలు

కమర్షియల్ టాక్స్, స్టాప్స్ రిజిస్ట్రేషన్, మైన్స్ ఆదాయాల్లో పెరుగుదల

విధాత, హైదరాబాద్ : ఓఆర్ఆర్ లోపల ఉన్న కాలుష్యకారక పరిశ్రమలన్నిటిని ఔటర్ రింగ్ రోడ్డుకు వెలుపలికి తరలించే ప్రక్రియను వేగవంతం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. శనివారం డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఆదాయ వనరుల సమీకరణ కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో భట్టి తో పాటు కమిటీ సభ్యులైన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావులు పాల్గొన్నారు. పరిశ్రమల తరలింపునకు సంబంధించి విధి విధానాలు, తరలింపు ప్రణాళిక క్యాలెండర్ ను రూపొందించాలని, తరలింపు ప్రక్రియకు తుది గడువును ఖరారు చేయాలని సబ్ కమిటీ సభ్యులు అధికారులను ఆదేశించారు.

సామాన్యులకు అందుబాటులో హౌసింగ్ బోర్డు ఇళ్ళవిక్రయాలు

గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో ఉన్న రాజీవ్ స్వగృహ పథకం కింద వివిధ దశల్లో ఉన్న ఇండ్లు, హౌసింగ్ బోర్డు ఖాళీ స్థలాల విక్రయాల బహిరంగ వేలం ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సబ్ కమిటీ సభ్యులు సూచించారు. సామాన్యులు, మధ్య తరగతి వర్గాలకు ఇండ్లు అందుబాటులో ఉండేలా హౌసింగ్ బోర్డు అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. గత నెల రోజుల వ్యవధిలో వివిధ శాఖల ఆదాయాల పెరుగుదల పై ఆయా శాఖలో ఉన్న అధికారులు సమావేశంలో నివేదిక సమర్పించారు. కమర్షియల్ టాక్స్ శాఖలో 1.8 శాతం, స్టాంప్స్ ఆండ్ రిజిస్ట్రేషన్ శాఖలో 3.6 శాతం, గనుల శాఖలో 7శాతం ఆదాయం పెరుగుదల ఉన్నట్టు అధికారులు మంత్రులకు నివేదించారు. సమావేశంలో చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ప్రదీప్ కుమార్ సుల్తానియా, పరిశ్రమల శాఖ స్పెషల్ సీఎస్ సంజయ్ కుమార్, గనుల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీధర్, మెట్రోపాలిటన్ ఏరియా నగర అభివృద్ధి శాఖ సెక్రటరీ ఇలంబర్తి, హెచ్ఎండిఏ కమిషనర్ సర్ఫరాజ్, గనుల శాఖ కమిషనర్ శశాంక, కలెక్టర్లు హరిచందన, నారాయణరెడ్డి, టీజీటీడీసీ ఎండీ వల్లూరు క్రాంతి, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.