విధాత, హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు(Supreme Court Orders)జారీ చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్ రావు కస్టడీని(prabhakar rao custody extension) మరో వారం రోజుల పాటు పొడిగించింది. డిసెంబర్ 26న ప్రభాకర్ రావును విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రభాకర్ రావు మరో వారం రోజుల పాటు..అంటే డిసెంబర్ 25వరకు పోలీస్ కస్టడీ విచారణ ఎదుర్కోనున్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు విచారణకు సంబంధించి శుక్రవారం సుప్రీంకోర్టులో ప్రభుత్వం, విచారణ బృందం స్టేటస్ రిపోర్టును సమర్పించింది. వారం రోజుల పాటు కస్టడీ విచారణ చేసినప్పటికి నిందితుడు ప్రభాకర్ రావు విచారణకు సహకరించలేదని, కీలకమైన కంప్యూటర్ డివైస్ ల ధ్వంసం చేయడం, పాస్ వర్డులను మార్చడం వంటి అంశాలపై ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా ప్రశ్నించినప్పటికి సమాధానం చెప్పలేదని సుప్రీంకోర్టుకు సొలిసిటర్ జనరల్ తుషార్ మోహతా, ప్రభుత్వ న్యాయవాది లూథ్రాలు నివేదించారు. ఇరువర్గాల వాదన విన్న అనంతరం సుప్రీంకోర్టు మరో వారం రోజుల పాటు ప్రభాకర్ రావు కస్టడీని పొడిగించింది. అయితే గతంలో నిందితుడికి కోర్టు కల్పించిన రక్షణల మేరకు 26న అతడిని జ్యూడీషియల్ కస్టడీ విధించకుండా విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఏర్పాటు
ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ సీపీ వీ.పీ.సజ్జనార్ నేతృత్వంలో కొత్త సిట్ ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేశారు. ఐదుగురు ఐపీఎస్ లు సహా మొత్తం 9 మంది అధికారులతో సిట్ ఏర్పాటు చేశారు. పంజాగుట్ట పీఎస్ క్రైం నంబర్ 243/2024 కేసును సిట్ విచారించనుంది. హైదరాబాద్ సీపీ సజ్జనార్, అంబర్ కిషోర్ ఝా (రామగుండం కమిషనర్), ఎస్.ఎం.విజయ్కుమార్ (సిద్దిపేట కమిషనర్), రితీరాజ్ (మాదాపూర్ డీసీపీ), కె.నారాయణరెడ్డి (మహేశ్వరం డీసీపీ), ఎం.రవీందర్రెడ్డి (గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్), కె.ఎస్.రావు (రాజేంద్రనగర్ అదనపు డీసీపీ), పి.వెంకటగిరి (జూబ్లీహిల్స్ ఏసీపీ), సీహెచ్ శ్రీధర్ (టీజీఏఎన్బీ డీఎస్పీ), నాగేందర్రావు (హైదరాబాద్ మెట్రో రైల్ డీఎస్పీ) లే సభ్యులుగా ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ వేగవంతం చేసేందుకు డీజీపీ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.
గతేడాది మార్చి 10న పంజాగుట్ట ఠాణాలో ఫోన్ ట్యాపింగ్ పై కేసు నమోదైంది. కేసు దర్యాప్తు క్రమంలో టాస్క్ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్రావు, అదనపు ఏసీపీలు భుజంగరావు, తిరుపతన్న, మాజీ డీఎస్పీ ప్రణీత్రావును అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వారిని విచారించిన క్రమంలోనే ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్రావును ప్రధాన నిందితుడిగా గుర్తించి 90 రోజుల్లోనే అభియోగపత్రం దాఖలు చేశారు. అయితే కేసు నమోదైన వెంటను ప్రభాకర్రావు, మరో నిందితుడు శ్రవణ్రావు అమెరికా పారిపోయారు. రెడ్కార్నర్ నోటీసులు జారీ చేయించి వారిని అతి కష్టం మీద రప్పించారు. వారిని విచారించినప్పటికి ఎస్ఐబీలో కీలకాధారాల్ని ధ్వంసం చేయడంతో దర్యాప్తులో పెద్దగా పురోగతి కనిపించలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలతో ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్ చేసిన ప్రభాకర్ రావు బృందం..ట్యాపింగ్ ఆధారాలను ధ్వంసం చేశామన్న ధీమాతో విచారణలో వాస్తవాలను వెల్లడించకుండా దర్యాప్తు బృందానికి చుక్కలు చూపించారు. ఈనేపథ్యంలోనే ఈ కేసును మరింత సమగ్రంగా విచారించేందుకు డీజీపీ కొత్తగా సిట్ ఏర్పాటు చేసి..త్వరిత గతిన చార్జ్ షీట్ దాఖలు చేయాలని ఆదేశించడంతో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరింత ఆసక్తికరంగా మారింది.
