తెలంగాణ అవసరాల మేరకే ఛత్తీస్‌గఢ్‌తో విద్యుత్తు ఒప్పందం: జస్టిస్‌ నర్సింహారెడ్డి కమిషన్‌కు జగదీశ్‌రెడ్డి 8 పేజీల లేఖ

ప్రత్యేక రాష్ట్ర అనంతరం తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఛత్తీస్‌గఢ్‌తో అప్పటి ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకుందని మాజీ విద్యుత్తు శాఖ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు

  • Publish Date - June 29, 2024 / 07:20 PM IST

హైదరాబాద్‌: ప్రత్యేక రాష్ట్ర అనంతరం తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఛత్తీస్‌గఢ్‌తో అప్పటి ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకుందని మాజీ విద్యుత్తు శాఖ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు. జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్‌కు ఆయన శనివారం లేఖ రాశారు. 2003లో కేంద్ర ప్రభుత్వ విద్యుత్తు చట్టం ప్రకారం.. పీజీసీఐఎల్ నిబంధనలకు లోబడి ఒప్పందాలు జరిగాయన్నారు. తెలంగాణ అభివృద్ధికి ఇది దోహదపడిందని.. ఎలాంటి నష్టం జరుగలేదని స్పష్టం చేశారు. నాటి చట్టాలకు, నిబంధనలకు లోబడి భద్రాద్రి విద్యుత్ కేంద్రాన్ని సబ్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మించినట్లు పేర్కొన్నారు. అతి తక్కువ కాలంలో నిర్మాణం పూర్తి చేస్తామని బీహెచ్ఈఎల్ ముందుకు రావడంతో కొత్తగూడెంలో 800 మెగావాట్ల ప్రాజెక్టు, మణుగూరులో నాలుగు 270 మెగావాట్ల ప్రాజెక్టుల నిర్మాణం ఆ సంస్థకు అప్పగించినట్లు చెప్పారు.

రైతులకు 24 గంటల విద్యుత్, పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా నల్గొండ జిల్లా దామరచర్లలో 4వేల మెగావాట్ల అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఒక అంశంపై విచారణ జరిగినప్పుడు ఒప్పందాల్లో భాగస్వాములైన వారందరినీ విచారించాలన్నారు. కానీ, కొంతమందిని మాత్రమే విచారించి మీడియా సమావేశంలో మాట్లాడడం బాధాకరమన్నారు. ఇలా చేయడం ద్వారా, తమ రాజకీయ ప్రత్యర్థులు కక్షపూరితంగా చేసిన నిరాధార, అర్థరహిత ఆరోపణలకు ఊతమిచ్చినట్లే అవుతుందన్నారు. ఈ సందర్భంగా ప్రస్తుత ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు వివిధ ప్రాజెక్టుల నిర్మాణం, ఛత్తీస్‌గఢ్‌తో విద్యుత్‌ కొనుగోలు, పీజీసీఐఎల్‌ లైన్‌లో వాటా కొనుగోలు ఒప్పందాలు, నిబంధనల ప్రకారం జరిగాయా? ప్రభుత్వ ఖజానాకు ఏమైనా నష్టం జరిగిందా? అనే విషయాలపై విచారణ జరుపుతున్న కమిషన్‌కు అందిన సమాచారాన్ని, తనకు తెలిసిన విషయాలు, అభిప్రాయాలను తెలిపేందుకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు.

Latest News