మరోసారి సిట్ విచారణకు హాజరైన ప్రభాకర్ రావు

Reported by: Tejaswini Nanna | తెలంగాణ‌ | Jul 15, 2025, 3:32 pm IST
Read Time: 2 mins
మరోసారి సిట్ విచారణకు హాజరైన ప్రభాకర్ రావు

విధాత, హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్ రావు(Former SIB chief T. Prabhakar Rao) మరోసారి సిట్ విచారణకు హాజరయ్యారు. సాక్షుల స్టేట్‌మెంట్లు ఆధారంగా ప్రభాకర్ రావును సిట్ అధికారులు ప్రశ్నించారు. 2023 నవంబర్ లో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ప్రభాకర్ రావు స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారు. 2023 నవంబర్ 15 నుండి 30 వరకు అందిన సర్వీసు ప్రొవైడర్ డేటాలో 618 ఫోన్ నెంబర్లను గుర్తించిన సిట్ దానిపై ప్రశ్నలు సంధించింది. మరోవైపు ఇప్పటికే సీజ్ చేసిన ప్రభాకర్ రావు ల్యాప్‌టాప్‌, ఫోన్‌ను ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్‌కి సిట్ అధికారులు పంపించారు. ఈ క్రమంలో 2023 అక్టోబర్ నుండి మార్చి15 వరకు కాల్ డేటాను బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభాకర్‌ రావు పలువురు బీఆర్‌ఎస్‌ నేతలతో, పోలీసు ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపినట్టు సిట్‌ గుర్తించింది.

ఇకపోతే ఆగస్టు 5 వరకు ప్రభాకర్ రావును అరెస్ట్ చేయరాదన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులను రద్దు చేయించడం ద్వారా, కస్టోడియల్ విచారణకు మార్గం సుగమం చేసుకోవాలని సిట్ అధికారులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలుకు నిర్ణయించారు.