డాక్యుమెంటేషన్ జరిగి నెలలు గడుస్తున్నా తమకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదంటూ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్స్ అభ్యర్థులు గాంధీభవన్ను ముట్టడించారు.
విధాత : డాక్యుమెంటేషన్ జరిగి నెలలు గడుస్తున్నా తమకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదంటూ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్స్ అభ్యర్థులు గాంధీభవన్ను ముట్టడించారు. రాష్ట్రంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 1540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ 2022, సెప్టెంబర్లో నోటిఫికేషన్ విడుదల చేసి, 2023 మే నెలలో పరీక్షలు నిర్వహించిందని తెలిపారు. అయితే ఇంతవరకు నియామక ప్రక్రియను మాత్రం కమిషన్ పూర్తిచేయలేకపోయిందని అభ్యర్థులు ఆందోళనకు దిగారు.
వెంటనే తమకు న్యాయం చేయాలని, రిక్రూట్మెంట్ ప్రక్రియను పూర్తిచేయాలంటూ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం మెట్లపై కూర్చుని నిరసన తెలిపారు. ఎన్నిసార్లు మంత్రులు, అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా ఫలితం లేకుండా పోయిందని అందుకే ఆందోళన చేపట్టామని, మా సమస్యపై సీఎం స్పందించి పరిష్కరించాలని కోరారు. నోటిఫికేషన్ ఇచ్చి రెండేండ్లు దాటినా ఇంకా రిక్రూట్మెంట్ కొలిక్కి రాలేందంటూ నిరసన వ్యక్తం చేశారు. మార్చి నెలలో 1:2 నిష్పత్తిలో టీజీపీఎస్సీ అభ్యర్థులను ఎంపిక చేసిందని, సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా పూర్తయిందని వెల్లడించారు. డాక్యుమెంటేషన్ జరిగి మూడు నెలలు గడిచినా నియామకపత్రాలు ఇవ్వడం లేదంటూ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
సీఎం ఇంటి ముందు గురుకుల టీచర్ల ఆందోళన
తీన్మార్ మల్లన్నకు నిరసన సెగ
విధాత : గురుకుల నియామకాల్లో అవతకతవకలు జరిగాయని, గురుకుల బోర్డు వైఖరితో తాము నష్టపోయామని మాకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గురుకుల అభ్యర్థులు సీఎం రేవంత్రెడ్డి నివాసం ముందు ధర్నాకు దిగారు. మోకాళ్లపై నిల్చుని దండం పెడుతూ నిరసన వ్యక్తం చేశారు. బోర్డు చేసిన తప్పులను తమపై రుద్దొద్దని, తమకు న్యాయం చేయాలని కోరారు. సరైన పద్దతిలో నియామక ప్రక్రియ జరుగకపోవడంతోనే ఒక్కొక్కరికి మూడు ఉద్యోగాలు వచ్చాయని చెప్పారు. తమ సమస్యలు పరిష్కరంలో దాటవేత వైఖరి అనుసరిస్తుందని, ఉద్యోగాలు ఇవ్వడం లేదని వాపోయారు. ఇన్నాళ్లు ఎన్నికల కోడ్ అని సాగదీశారని, ఇప్పుడు స్కూళ్లు కూడా ప్రారంభమవుతున్నాయని తమకు ఇంకెప్పుడు న్యాయం చేస్తారంటూ నిరసన వ్యక్తం చేశారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన తీన్మార్ మల్లన్నను అడ్డుకుని తమ సమస్యలు పరిష్కారానికి చొరవ చూపాలని డిమాండ్ చేశారు. స్పందించిన మల్లన్న మీ సమస్యలను ఫ్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే ప్రయత్నం చేస్తానని హామీఇచ్చారు
వేతనాల కోసం సీఎం ఇంటి ముందు నర్సింగ్ స్టాఫ్ ఆందోళన
విధాత : వేతనాల చెల్లింపులో నెలల తరబడి పెండింగ్లో ఉన్న వేతనాల చెల్లింపు సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నర్సింగ్ స్టాఫ్ ఉద్యోగులు బుధవారం సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందు ఆందోళన నిర్వహించారు. సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకా జనవరి 31న ఎల్బీ స్టేడియం వేదికగా చేపట్టిన తొలి నియామకాల్లో భాగంగా 6,956 నర్సింగ్ స్టాఫ్ ఉద్యోగులకు నియామక పత్రాలు అందించారు. అయితే వారికి వేతనాల చెల్లింపుకు సంబంధించిన ప్రక్రియ పూర్తి చేయలేదు. దీంతో విధుల్లో చేరిన ఉద్యోగులకు నాలుగు నెలలుగా వేతనాలు అందడం లేదు. ఉద్యోగం వచ్చిందన్న సంతోషం కూడా వారికి లేకుండాపోగా జీతాల కోసం ఆందోళనలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో స్టాఫ్ నర్స్లు తమ వేతనాల సమస్యను వెంటనే పరిష్కరించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సీఎం ఇంటి ముందు తమ నిరసన వ్యక్తం చేశారు.