Anganwadi Teacher | భ‌ర్త చేసిన త‌ప్పుకు.. అంగ‌న్‌వాడీ టీచ‌ర్‌ను చెట్టుకు క‌ట్టేశారు

Anganwadi Teacher | భ‌ర్త చేసిన త‌ప్పిదానికి భార్యను హింసించారు. మ‌హిళ అని చూడ‌కుండా.. ఆమెను చెట్టుకు క‌ట్టేసి రాక్ష‌సానందం పొందారు. చివ‌ర‌కు గుండు గీయించి ఊరేగిస్తామ‌ని బెదిరింపుల‌కు పాల్ప‌డ్డారు. పోలీసుల రంగ ప్ర‌వేశంతో ఆమె ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డింది.

Anganwadi Teacher | భ‌ర్త చేసిన త‌ప్పిదానికి భార్యను హింసించారు. మ‌హిళ అని చూడ‌కుండా.. ఆమెను చెట్టుకు క‌ట్టేసి రాక్ష‌సానందం పొందారు. చివ‌ర‌కు గుండు గీయించి ఊరేగిస్తామ‌ని బెదిరింపుల‌కు పాల్ప‌డ్డారు. పోలీసుల రంగ ప్ర‌వేశంతో ఆమె ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డింది.

భ‌ర్త ఏం చేశాడంటే..?

సంగారెడ్డి జిల్లా కంగ్టీ మండ‌ల ప‌రిధిలోని ర‌సోల్ గ్రామంలోని అంగ‌న్‌వాడీ స్కూల్‌లో ప‌ట్లోళ్ల వసంత కుమారి(60) గ‌త కొన్నేండ్ల నుంచి టీచ‌ర్‌గా విధులు నిర్వ‌హిస్తోంది. ఆమె భ‌ర్త ఇన్సూరెన్స్ ఏజెంట్‌గా ప‌ని చేస్తున్నాడు. అయితే ర‌సోల్ గ్రామ‌స్తుల‌తో త‌మ‌కున్న ప‌రిచ‌యంతో భ‌ర్త‌.. ఇన్సూరెన్స్ పేరిట ల‌క్ష‌ల రూపాయాలు వ‌సూలు చేశాడు. ఆ డ‌బ్బుల‌ను కంపెనీకి చెల్లించ‌కుండా త‌న సొంత ఖ‌ర్చుల‌కు వినియోగించుకున్నాడు. మొత్తానికి తాము మోస‌పోయామ‌ని బాధితులు గ్ర‌హించారు. త‌మ డ‌బ్బులు త‌మ‌కు ఇవ్వాల‌ని ప‌లుమార్లు గ్రామ‌స్తులు డిమాండ్ చేశారు. అయినా కూడా అత‌ను చెల్లించ‌లేదు.

ఈ క్ర‌మంలో బుధ‌వారం ఏజెంట్ భార్య వ‌సంత కుమారిని ర‌సోల్ గ్రామ‌స్తులు అంగ‌న్‌వాడీ స్కూల్ నుంచి బ‌య‌ట‌కు లాక్కొచ్చారు. ఆ త‌ర్వాత ఆమెను ఓ చెట్టుకు క‌ట్టేసి.. డ‌బ్బులు చెల్లించాల‌ని డిమాండ్ చేశారు. గంట‌న్న‌ర పాటు ఆమెను హింసించారు. డ‌బ్బులివ్వ‌క‌పోతే గుండు గీయించి ఊరేగిస్తామ‌ని హెచ్చ‌రించారు.

కేసు కోర్టులో ఉన్నందున తీర్పు రాగానే డ‌బ్బులు చెల్లిస్తామ‌ని అంగ‌న్‌వాడీ టీచ‌ర్ చెప్పిన‌ప్ప‌టికీ వారు వినిపించుకోలేదు. మొత్తానికి పోలీసులు రంగ ప్ర‌వేశం చేసి గ్రామ‌స్తుల నుంచి ఆమెను కాపాడారు. ఐదుగురు వ్య‌క్తుల‌పై పోలీసులు కేసు న‌మోదు చేశారు. ద‌ర్యాప్తు చేప‌ట్టిన అనంత‌రం చ‌ట్టం ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని కంగ్టీ పోలీసులు తెలిపారు.

Latest News