Hyderabad | హైద‌రాబాద్ : నేటి నుంచి జూన్ 12వ తేదీ వ‌ర‌కు హైద‌రాబాద్ న‌గ‌రంలో జిరాక్స్, ఇంట‌ర్నెట్ సెంట‌ర్ల‌ను మూసివేయ‌నున్నారు. ఎందుకంటే ప‌దో త‌ర‌గ‌తి అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు జ‌రుగుతున్న నేప‌థ్యంలో. హైద‌రాబాద్, సైబ‌రాబాద్, మ‌ల్కాజ్‌గిరి పోలీసు క‌మిష‌న‌రేట్ల ప‌రిధిలో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు జ‌రిగే కేంద్రాల వ‌ద్ద పోలీసులు 163 సెక్ష‌న్ విధించారు. ఈ సెక్ష‌న్ ప్ర‌కారం ప‌రీక్షా కేంద్రాల వ‌ద్ద ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడొద్దు. 200 మీట‌ర్ల రేడియ‌స్ వ‌ర‌కు నిబంధ‌న‌లు అమ‌ల్లో ఉంటాయ‌ని పోలీసులు తెలిపారు. ప‌రీక్షా కేంద్రాల‌కు 100 మీట‌ర్ల రేడియ‌స్‌లో ఉన్న జిరాక్స్, ఇంట‌ర్నెట్ సెంట‌ర్లు కూడా మూసివేయ‌నున్నారు.

ఇక ప‌ది అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు ఉద‌యం 9.30 నుంచి మ‌ధ్యాహ్నం 12.50 గంట‌ల వ‌ర‌కు కొన‌సాగ‌నున్నాయి. ఫిజిక‌ల్ సైన్స్, బ‌యాల‌జీ ప‌రీక్ష‌లు రెండు వేర్వేరు రోజుల్లో ఉద‌యం 9.30 నుంచి ఉద‌యం 11 గంట‌ల వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్నారు.

ఈ ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌య్యే విద్యార్థులు హాల్ టికెట్ల‌ను బోర్డు వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. లేదా సంబంధిత స్కూల్ ప్రిన్సిప‌ల్ వ‌ద్ద తీసుకోని ప‌రీక్ష‌ల‌కు హాజరు కావొచ్చు. ఈ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌ల‌కు మొత్తం 31,542 మంది హాజ‌రు కానున్నారు. త‌దిత‌ర వివ‌రాల కోసం 040-23230942 నంబ‌ర్‌ను సంప్ర‌దించొచ్చు.