యాదాద్రి, భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లలో అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి, వంద రోజుల్లో నివేదిక సమర్పిస్తామని పవర్ ప్లాంట్లు, పీపీఏల అక్రమాలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ
విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలపైనా విచారణ
నిర్ణయాలు తీసుకున్నవారినీ విచారిస్తాం
విచారణ కమిటీ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి
విధాత, హైదరాబాద్: యాదాద్రి, భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లలో అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి, వంద రోజుల్లో నివేదిక సమర్పిస్తామని పవర్ ప్లాంట్లు, పీపీఏల అక్రమాలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ కమిటీ చైర్మన్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి వెల్లడించారు. విద్యుత్తు ప్లాంట్లు, విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలలో అక్రమాలపై జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి అధ్యక్షతన కమిటీ ఆదివారం సమావేశమైంది. ఈ సమావేశానికి ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీలు, ఇతర అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జస్టిస్ నరసింహారెడ్డి మాట్లాడుతూ పవర్ ప్లాంట్లలో అక్రమాలపై 2 గంటలు సమీక్షించామని పేర్కొన్నారు. ప్లాంట్ల నిర్మాణాల్లో, పీపీఏలపై నిర్ణయాలు తీసుకున్న అధికారులకు లేఖలు రాసి, విచారణలో వారి అభిప్రాయాలు వింటామని చెప్పారు. పవర్ ప్లాంట్లలో అక్రమాలపై రాజకీయాలకు అతీతంగా విచారణ చేస్తామని స్పష్టం చేశారు. వంద రోజుల్లో నివేదిక ఇస్తామని స్పష్టం చేశారు. పీపీఏ ఒప్పందాలపై విచారణ చేస్తామన్నారు. ఇవాళ ప్రాథమిక పరిశీలన చేశామని, ప్లాంట్లకు సంబంధించిన అన్ని ఫైళ్లు వచ్చాయని తెలిపారు. థర్మల్ ప్లాంట్ నిర్మాణ పనుల్లో అక్రమాలు, ఛత్తీస్గఢ్తో రాష్ట్ర విద్యుత్తు పంపిణీ సంస్థలు చేసుకున్న పీపీఏలపై విచారణ ప్రారంభించామని జస్టిస్ నరసింహారెడ్డి వెల్లడించారు. పబ్లిక్ నోటీస్లతో ప్రజా అభిప్రాయ సేకరణ చేస్తామని, సమాచారం అవసరం అనుకున్న వారికి నోటీసులు కూడా అందజేస్తామని స్పష్టం చేశారు.