పిల్ల‌ల‌ను అడ్డుపెట్టుకొని కేసీఆర్ రాజ‌కీయాలు: రేవంత్‌రెడ్డి

  • Publish Date - October 8, 2023 / 05:46 AM IST
  • బ్రేక్‌ఫాస్ట్ స్కీం ప్రారంభోత్సవ ఆర్భాటం
  • పెరిగిన ధ‌ర‌ల‌కు బ‌డ్జెట్ పెంచ‌లేదు
  • భోజన కార్మికుల స‌మ‌స్య‌లు విస్మరించారు
  • సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ‌

విధాత‌, హైద‌రాబాద్‌: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న పిల్లలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసే దుస్థితికి సీఎం కేసీఆర్‌ దిగజారారని టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. సవాలక్ష సమస్యలతో మధ్యాహ్న భోజన పథకం అభాసు పాలవుతుంటే, ఇవేమీ పట్టించుకోకుండా సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకం అంటూ హడావుడి చేస్తున్నారని అన్నారు. ఈ మేర‌కు సీఎం కేసీఆర్‌కు శనివారం ఆయ‌న‌ బహిరంగ లేఖ రాశారు.

పెరిగిన ధరలకు అనుగుణంగా బడ్జెట్‌ పెంచకుండానే, మధ్యాహ్న భోజనం మెనూలో మార్పులు చేసి వంట కార్మికులకు ఆర్థిక భారంతోపాటు పనిభారం పెంచారని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా చాలా పాఠశాలల్లో వంట గదులే సక్రమంగా లేవన్నారు. చెట్ల కింద వంటలు చేస్తున్న పరిస్థితి ఉంద‌ని పేర్కొన్నారు. దాని మూలంగా అక్కడక్కడా మధ్యాహ్న భోజనం కలుషితమై విద్యార్థులు అస్వస్థతకు గురైన సందర్భాలు ఉన్నాయన్నారు. మధ్యాహ్న భోజన కార్మికులు త‌మ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని విన్న‌వించుకున్నా బీఆరెస్ ప్ర‌భుత్వం ప‌ట్టించుకున్న పాపాన పోలేద‌న్నారు.


జీవో 8 ప్రకారం పెరిగిన వేతనాలను ఏరియర్స్‌ తో సహా వెంటనే చెల్లించాలన్న వారి డిమాండ్లను పట్టించుకోలేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు, గురుకులాలు, సంక్షేమ హాస్టళ్ల నిర్వహణ ఇంత అధ్వానంగా ఉంటే, ఆ పరిస్థితులపై ఒక్కసారి కూడా మీరు సమీక్ష నిర్వహించిన పాపాన పోలేదన్నారు. మధ్యాహ్న భోజన పథకంలోని సమస్యలతోపాటు కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలని, సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని  డిమాండ్ చేశారు.